Vehicle Dealers: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో నిబంధనలు పాటించని వాహన షోరూమ్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ కమిషనర్ ఇలంబరితి స్పష్టం చేశారు. అన్ని వాహన షోరూమ్ డీలర్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, అన్ని జిల్లాల రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మోటారు వాహనాల చట్టం, 1988లోని సెక్షన్ 43 ప్రకారం తప్పనిసరి అయిన వాలిడ్ టెంపరరీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు (టీఆర్ఎస్) జారీ చేయకుండా కొందరు డీలర్లు, షోరూమ్లు వాహనాలను కొనుగోలుదారులకు డెలివరీ చేస్తున్నారన్నారు. వాహన డెలివరీ సమయంలో కొనుగోలుదారుల నుంచి అనధికారికంగా, అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో ప్రజలకు ఇబ్బంది, ఆర్థిక నష్టం కలుగుతున్నందున ఈ తనిఖీలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
టెంపరరీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు వాహన్ పోర్టల్ ద్వారా జారీ అయినవా? వాహన/యజమాని వివరాలు సరిగ్గా ఉన్నాయా అనే అంశాలు పరిశీలించనున్నారు. చట్టబద్ధమైన ఫీజులు, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ కు అదనంగా హ్యాండ్లింగ్, లాజిస్టిక్స్, డెలివరీ, డాక్యుమెంటేషన్ చార్జీల వంటి అనధికార వసూల్లు, వాహనాల డెలివరీ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్, టీఆర్ ఇష్యూ రిజిస్టర్ వంటి చట్టబద్ధమైన రిజిస్టర్ల నిర్వహణ, డెలివరీకి ముందు వాలిడ్ థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ చెల్లింపు, కొనుగోలుదారుల సమాచారం కోసం ఎక్స్-షోరూమ్ ధర, చట్టబద్ధమైన లెవీలను ప్రదర్శించడం జరుగుతుందన్నారు.
Also read: Friday OTT Releases : ఫ్రైడే ఓటీటీ వినోదం.. ఒక్కరోజే 10 కి పైగా స్ట్రీమింగ్..!
సర్క్యులర్ జారీ అయిన తేదీ నుంచి15 రోజుల్లోగా తనిఖీలు పూర్తి చేయాలని ఆదేశించారు. ఏవైనా ఉల్లంఘనలు గుర్తించినట్లయితే వెంటనే లిఖితపూర్వకంగా నమోదు చేసి, షో కాజ్ నోటీసులు జారీ చేయడం, మోటారు వాహనాల చట్టం సెక్షన్లు 43, 192, 179 కింద ప్రాసిక్యూషన్ చేపట్టడం, తీవ్రమైన , పునరావృత ఉల్లంఘనల విషయంలో సెంట్రల్ మోటార్ వాహనాల నిబంధనలు, 1989లోని రూల్ 42 కింద డీలర్ ట్రేడ్ సర్టిఫికెట్ను సస్పెండ్ చేయడం లేదా రద్దు చేయడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. అధికంగా లేదా అనధికారికంగా వసూలు చేసిన ఛార్జీలను కొనుగోలుదారులకు తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకుంటారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఆదేశాల అమలును జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్) మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ పర్యవేక్షిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాహనం డెలివరీ సమయంలో వాలిడ్ టెంపరరీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, చెల్లించిన ప్రతి మొత్తానికి సరైన రసీదులను తప్పనిసరిగా తీసుకోవాలని, ఏవైనా అవకతవకలు గమనించినట్లయితే సమీప రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసు/డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసుకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు, వాహన కొనుగోలుదారులకు సూచారు.
Also Read: NMC Inspection: మంత్రి దామోదర రాజనర్సింహ వ్యూహం సక్సెస్.. సీట్ల భర్తీకి లైన్ క్లియర్!