Advocate Murder: స్వేఛ్చ బ్యూరో: మహిళ న్యాయవాదిని అత్యంత పాశవికంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మంత్రి సీతక్క కోరారు. మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో ఆస్తి వివాదం కారణంగా ఒక యువ న్యాయవాది మంగళవారం దారుణంగా హత్యకు గురైన ఘటన తనను కలచివేసిందని మంత్రి సీతక్క తెలిపారు. ఆస్తులు, ఆర్థిక కారణాల పేరుతో రక్తసంబంధాలు తెగిపోవడం, మానవీయ బంధాలు నశించిపోవడం మన సమాజం ఎదుర్కొంటున్న అత్యంత విషాదకర పరిస్థితిగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోదర బంధం వంటి పవిత్రమైన సంబంధాలు కూడా ఆస్తుల కోసం హింసకు, హత్యలకు దారి తీస్తుండటం తీవ్రంగా కలవరపెడుతోందని మంత్రి పేర్కొన్నారు.
న్యాయవృత్తిని ఎంచుకుని సమాజానికి సేవ చేయాలనుకున్న ఒక యువతి ఇలాంటి దారుణానికి బలవడం అత్యంత బాధాకరమని అన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఆస్తి వివాదాలకు హింసే పరిష్కారం అన్న భావన సమాజంలో పెరగడం ప్రమాదకరమని, సమస్యలను చర్చలు, న్యాయపరమైన మార్గాల్లో పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. మానవ విలువలు, కుటుంబ బంధాల ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
Also Read: Sumathi Sathakam Amardeep: రవితేజ మాస్టారూ ప్రశంసల వరకేనా..అవకాశం ఏమైనా ఉందా?