Narayanpet Family: నారాయణపేట జిల్లా మాగనూరు మండలం వర్కూర్ గ్రామానికి చెందిన అజయ్–సరిత దంపతులు ప్రస్తుతం మక్తల్ పట్టణంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అయితే విధి ఆ ఇంట్లో విషాదాన్ని నింపింది. కుమారుడు పుట్టినప్పటి నుంచే నాడీ సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు.
11 ఏళ్లుగా చక్రాల కుర్చీలోనే..
కొడుకు ఆరోగ్యం కోసం ఆ తల్లిదండ్రులు తిరగని ఆసుపత్రి లేదు, కలవని డాక్టర్ లేడు. చికిత్స కోసం ఉన్నదంతా అమ్మి లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. గత 11 ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితమైన కుమారుడి బాగోగులు చూసుకోవడమే ఆ కన్నతల్లి సరిత జీవితంగా మారిపోయింది. తోటి పిల్లల్లా ఆడుకోవాలని ఆశ ఉన్నా… కాళ్లు, చేతులు అసలే సహకరించవు.
Also Read: ఘన్పూర్ లెదర్ పార్క్.. హామీలకే పరిమితమా?
ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబం..
ఒకవైపు కొడుకు పరిస్థితి ఇలా ఉంటే… మరోవైపు కుటుంబ పెద్ద అజయ్కు కూడా 30 శాతం అంగవైకల్యం ఉంది. అయినా సరే, కుటుంబాన్ని పోషించేందుకు ఆయన మక్తల్లోని ఓ హోటల్లో పనిచేస్తున్నారు. రోజంతా కష్టపడితే వచ్చేది 300 మాత్రమే. ఆ ఆదాయంతోనే ఇంటి ఖర్చులు, కూతురి చదువు, కొడుకు మందుల ఖర్చులు భరించలేక ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. 11 ఏళ్లుగా కొడుకును కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఆ తల్లి ఇప్పుడు సమాజం వైపు ఆశగా చూస్తోంది. దాతలు స్పందిస్తే ఓ కుటుంబ తలరాత మారుతుంది.