Rain Update: తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు ప్రతాపం చూపిస్తుండడంతో జనాలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావడం లేదు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఈరోజు రాత్రి, రేపు అక్కడక్కడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
⦿ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
ఈ రోజు రాత్రి కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. గంటలకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో.. బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వివరించింది.
⦿ రేపు 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్..
రేపు తెలంగాణలో 11 జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని.. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణ పేట్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది.
Also Read: NRSC Recruitment: ఏదైనా డిగ్రీ ఉంటే చాలు భయ్యా.. హైదరాబాద్లో ఉద్యోగాలు.. జీతం మాత్రం రూ.56,100
⦿ భారీ వర్షాల పట్ల జాగ్రత్త
రాష్ట్రంలో రేపు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం పడనుండడంతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వర్షం పడుతున్న సమయంలో.. చెట్ల కింద ఉండొద్దని చెబుతున్నారు. కరెంట్ వైర్ల కింద ఎట్టి పరిస్థితుల్లో నిలుచోరాదని కీలక సూచనలు ఇస్తున్నారు.