Miryalaguda: స్వేచ్ఛ బ్యూరో: నల్గొండ జిల్లా మిర్యాలగూడ(Miryalaguda)లో సన్న ధాన్యం కొనుగోలులో మిల్లర్ల ఇష్టారాజ్యం నడుస్తోంది. ఈ ప్రాంత రైతులు తెచ్చిన ధాన్యాన్ని గంటలు రోజుల తరబడి దిగుమతి చేసుకోకుండా.. పచ్చ గింజ పేరిట రేట్లు తగ్గిస్తూ మద్దతు ధర కూడా ఇవ్వని రైస్ మిల్లర్లు సూర్యాపేట, హుజూర్ నగర్, సహా ఇతర జిల్లాల నుంచి లారీల్లో పెద్ద ఎత్తున వస్తున్న ధాన్యాన్ని దిగుమతి చేసుకుంటూ లోకల్ రైతులకు మొండి చేయి చూపెడుతున్నారు. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటను అమ్ముకునే రైతులకు తక్కువ ధర వస్తుండగా దళారులు, వ్యాపారులు కుమ్మక్కై ఈ ప్రాంత రైస్ మిల్లులకు తరలిస్తున్నారు.
సన్నధాన్యానికి క్వింటాళ్లకు రూ. 2450 వరకు చెల్లిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరి కోతలు ముమ్మరమై సామాన్య రైతులు ట్రాక్టర్లలో తమ ధాన్యం అమ్ముకునేందుకు ఇక్కడ రైస్ మిల్లులకు తరలిస్తుండగా కనీసం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మిల్లర్లను ప్రాధేయ పడుతున్న మిల్లర్లు కనికరించని పరిస్థితి నెలకొంది. దళారులు తెచ్చిన ధాన్యాన్ని అత్యధిక ధరకు కొనుగోలు చేయటం.. తమకు తక్కువ ధరలు చెల్లిస్తూ ఉండడం పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ధాన్యం అడ్డగింత, విడిచిపెట్టడంలో హైడ్రామా చేస్తున్నారు. నల్లగొండ(Nalgonda) జిల్లా వ్యాప్తంగా సుమారు 5.56 లక్షల ఎకరాలలో వరి సాగును చేపట్టగా 70 శాతం దొడ్డు వడ్లు, 30 శాతం సన్న ధాన్యం సాగు చేశారు. ప్రధానంగా మిర్యాలగూడ నాగార్జునసాగర్ నియోజకవర్గాల పరిధిలోని దిగుబడి చేసిన సన్నధాన్యాన్ని రైతులు మిర్యాలగూడ పరిధిలోని మిల్లులకు తరలిస్తున్నారు. ఒక్కో రైస్ మిల్లు వద్ద సుమారు 200 నుంచి 250 ట్రాక్టర్లు మిల్లుల వద్ద ఉన్నాయి. ఒక్కో రైస్ మిల్ కెపాసిటీ రోజుకు 1000 నుంచి 1500 ట్రాక్టర్ల ధాన్యం దిగుమతి చేసుకునే పరిస్థితి ఉన్న ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన లారీల ధాన్యాన్ని వేగంగా దిగుమతి చేసుకుంటున్న మిల్లర్లు ట్రాక్టర్లలో వచ్చే దాన్యాన్ని చేసుకోకపోవడంపై రైతులు అసహనానికి గురవుతున్నారు.
Also Read: Rain: కప్పలు అరిస్తే నిజంగానే వర్షం పడుతుందా? దీని వెనుకున్న సైన్స్ ఇదే!
గత శుక్రవారం సూర్యాపేట(Surayapeta), ఇతర జిల్లాల నుంచి ఆలగడప టోల్ గేట్ మీదుగా మిర్యాలగూడ ప్రాంతానికి పెద్ద ఎత్తున ధాన్యం లారీలు వస్తున్న విషయమై సమాచారం అందుకున్న సివిల్ సప్లై, పోలీస్ శాఖ అధికారులు కొన్ని లారీలను తనిఖీ చేసి పట్టుకున్నారు. అయితే వేములపల్లి మండల పరిధిలోని మహాతేజ, పద్మశ్రీ, మల్లేపల్లి పరిధిలోని ఓ రైస్ మిల్లుకి సుమారు 60 లారీల తరలినట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు. కాగా టోల్ గేట్ వద్ద పట్టుబడిన లారీలను గంటల వ్యవధిలో వదిలివేయటం పలు అనుమానాలకు తావిస్తోంది.
స్థానిక రైతుల ధాన్యం కొనుగోలుకు ప్రాధాన్యత ఇవ్వాలి ఈ ప్రాంత రైస్ మిల్లర్లు స్థానిక రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే ధాన్యానికి క్వింటాళ్లకు రూ. 2400, 2430 వరకు చెల్లిస్తున్న రైస్ మిల్లర్లు లోకల్ రైతులకు రూ. 2100 మద్దతు ధరకు తక్కువ రూ. 200 నుంచి రూ. 289 వరకు తక్కువ చెల్లించడం గమనార్హం. ఇప్పటికైనా మిర్యాలగూడ రైస్ మిల్లర్లు ఈ ప్రాంత రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతున్నారు. మిర్యాలగూడ పరిధిలోని సబ్ స్టేషన్ల పరిధిలో రిపేర్లను సాకుగా చూపి ట్రాక్టర్లలో తెచ్చిన ధాన్యం ఆలస్యం చేయటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ప్రమోషనా పనిష్మెంటా.. సెక్రటేరియట్లో ఆమె బదిలీ వెనక ఆంతర్యమేమిటో..?