Soil Fertility: స్వేచ్ఛ బ్యూరో: పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం సహజ ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించడంతో ఏటా భూమిలో రసాయనాల ప్రభావంతో గాఢత పెరిగిపోతోంది. ఈ గాఢత పెరుగుతుండడంతో భూములు పూర్తిగా సారం కోల్పోయి రానున్న కాలంలో చవుడు భూములుగా మారిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుత ఆధునిక యుగంలో సాంకేతిక ప్రజ్ఞానం రోజు రోజుకి పెరుగుతున్నప్పటికీ రైతులకు ఈ స్థాయిలో అవగాహన కల్పించడం లేదు. దీంతో రైతులు రెడీమేడ్ వ్యవసాయానికి అలవాటు పడడంతో భవిష్యత్తులో భూములు పంటలకు అనువుగా ఉండే పరిస్థితి లేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రైతులు దిగుబడి అధికంగా రావాలంటూ ఎరువులు, పురుగుమందులు గతం కంటే విచక్షణారహితంగా పంట పొలాల్లో వినియోగిస్తున్నారు.ఫలితంగా దీర్ఘకాలంలో భూముల సారంపై ప్రభావం చూపుతాయని పర్యావరణ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
రైతులు సాగు చేసే పంటలకు ముందు భూసార పరీక్షలతో రైతులకు మేలు చేకూరుతుంది. రైతులు సాగు చేస్తున్న పంటల్లో ఎక్కువగా రసాయన ఎరువులు వాడడం పెరగడంతో క్రమంగా భూసారం తగ్గుతూ వస్తోంది. రైతులు ఎప్పటికప్పుడు భూసార పరీక్షలు నిర్వహించి వ్యవసాయ అధికారుల సూచనలు మేరకు పంట సాగు చేస్తే అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కొన్నేళ్లుగా భూసార పరీక్షలను పూర్తిగా నిలిపివేయడంతో దిగుబడిపై ప్రభావం గణనీయంగా చూపుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లో పరీక్షల కోసం జడ్చర్ల తదితర పరీక్షల కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో రైతులపై ప్రయాణ భారంతో పాటు ఆర్థిక భారం కూడా పడుతుంది. రైతులకు భూసార పరీక్షలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Also Read: వైసీపీలో మౌన మునిలైన మాజీ మంత్రులు.. భయానికి అసలు కారణం అదేనా..?
వ్యవసాయ శాఖ సిబ్బందికి 2020 వరకు భూసార పరీక్షలు చేయించే బాధ్యత ప్రభుత్వం అప్పగించింది. కాగా గత ఐదేళ్లుగా రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండి ఆర్థిక భారం తగ్గించే భూసార పరీక్షల నిర్వహణకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. గత సంవత్సరం వాలంటీర్ల ఏం పికప్ ప్రక్రియ జిల్లాలో చేపట్టినప్పటికీ అందుకు నిధుల కొరత కారణంగా నిలిపివేశారు. ప్రస్తుతం సైతం వాలంటీర్లను నియమించేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఆసక్తిగల రైతులే తమ ఆసక్తితో భూసార పరీక్షలు చేయించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. రైతు వేదికలు నిర్మించిన సమయంలో భూసార పరీక్షల కిట్లు అందుబాటులో ఉంచి, రైతులకు అవసరమైనప్పుడు పరీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. కానీ కిట్ లు ఇచ్చి రసాయనాలు అందించడం లేదు.
కొన్ని చోట్ల రసాయనాలు అయిపోగా ఇప్పటివరకు సరఫరా చేయలేదు . జోగులాంబ గద్వాల జిల్లాలో వరితో పాటు వాణిజ్య పంటలైన పత్తి ,మిరప, మొక్కజొన్న, వేరుశనగ, పొగాకు, తదితర పంటలను సాగు చేస్తారు. జిల్లాలో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంతో పాటు జూరాల ఆయకట్టు వంటి సాగునీటి వనరులు ఉండడంతో నడిగడ్డలో వరి పంట సాగు అధికంగా ఉంటోంది. వరికి ఒక ఎకరాకు ఒక బస్తా యూరియా సరిపోతుందని వ్యవసాయ అధికారులు చెబుతున్నా,ప్రైవేట్ కంపెనీల మాటలు విని రైతులు మూడు బస్తాల వరకు యూరియా వినియోగిస్తున్నారు. ఇది భూసారం పై ప్రభావం చూపుతోంది .యూరియా లీటర్ బాటిల్లో తయారు చేస్తూ ప్రత్యామ్నాయంగా రైతులకు అందుబాటులో ఉంచుతోంది.
భూసార పరీక్షలపై రైతులకు ఆసక్తి ఉంటే భూసార పరీక్షలు చేయిస్తాం. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం ఎటువంటి లక్ష్యాలు ఇవ్వడం లేదు. దీంతో రైతులు భూసార పరీక్ష చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. మూడేళ్లుగా పరీక్షల నిర్వహణకు అవసరమైన మెటీరియల్ సరఫరా కూడా ఆగిపోయింది.రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకుంటే వారు సాగు చేసే పంటలకు అవసరమైన ఎరువులను మాత్రమే వినియోగించడం ద్వారా పెట్టుబడి భారం తగ్గుతుంది.
Also Read: మగాడికి లేని నిబంధన మాకెందుకు.. మోదీ సర్కార్ పై ట్రాన్స్ జెండర్లు నిప్పులు!