Stubble Burning: స్వేచ్చ బ్యూరో: కొందరు రైతుల బాధ్యతారాహిత్యం తోటి రైతుకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది. పొలాల్లో వరికొయ్యలను తగులబెట్టవద్దని అధికారులు నెత్తీనోరూ బాదుకుంటున్నా, కొందరి నిర్లక్ష్యం వల్ల ఒక రైతుకు చెందిన ఆయిల్ పామ్ తోట పూర్తిగా బూడిదైన విషాద ఘటన హుజూరాబాద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన కన్నబోయిన మహేందర్ అనే రైతుకు చెందిన ఆయిల్ పామ్ తోట పక్కన.. కొందరు రైతులు పంట కోతల అనంతరం మిగిలిన వరికొయ్యలను తగులబెట్టారు. ఎండ తీవ్రత, ఈదురుగాలుల వల్ల ఆ మంటలు వేగంగా మహేందర్ తోటకు వ్యాపించాయి. రాత్రి వరకు మంటలు ఎగసిపడటంతో దాదాపు 45 ఆయిల్ పామ్ చెట్లు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయడంతో మిగిలిన తోట తృటిలో తప్పించుకుందని బాధితుడు కన్నీరుమున్నీరయ్యాడు.
Also read; ‘తెలంగాణ సెంటిమెంట్.. ఒక ఫ్యాషన్ అయ్యింది’.. బీఆర్ఎస్పై రఘునందన్ రావు ఫైర్
వరికొయ్యలను కాల్చడం వల్ల భూసారం దెబ్బతినడమే కాకుండా, ఇలాంటి పెను ప్రమాదాలు జరుగుతాయని వ్యవసాయ శాఖ ఎంత అవగాహన కల్పిస్తున్నా కొందరు రైతులు పాత పద్ధతులనే అవలంబిస్తున్నారు. గతంలోనూ ఇక్కడ వరికొయ్యల మంటల వల్ల గడ్డివాములు, విద్యుత్ మోటార్లు కాలిపోయిన ఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా రైతులు ఈ ప్రమాదకర అలవాటును మానుకోకపోతే చట్టపరమైన చర్యలతో పాటు భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read; కాంగ్రెస్ సర్కార్ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?