BJP Telangana: స్వేచ్చ బ్యూరో: తెలంగాణలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికలను సెమీ ఫైనల్ గా భావిస్తున్న ఆ ఎలక్షన్ లో కాషాయజెండాను రెపరెపలాండించి ఫైనల్ మ్యాచ్ గా భావిస్తున్న వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ముందుకువెళ్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా.., బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ చేపట్టిన మూడు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర ముఖ్య నేతలతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని గ్రూపు రాజకీయాలపై, కొంతమంది నేతల ప్రవర్తనపై బన్సల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్లు తెలుస్తోంది. తాను 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, పార్టీలో ఎప్పటి నుంచో సీనియర్ ను అని చెప్పుకుంటూ తిరిగే నేతలకు సునీల్ బన్సల్ గట్టి హెచ్చరికలు జారీచేశారు. ఎవరు ఎన్ని ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారనేది ముఖ్యం కాదని, పార్టీ కోసం ఎవరేం చేశారు? ఎన్ని బూత్లను పటిష్టం చేశారు? అనేదే ముఖ్యమని ఆయన కేడర్ కు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
కొందరు నేతలు పార్టీ ఇచ్చిన పదవులను కేవలం తమ సొంత పనులకు, వ్యక్తిగత పరపతి పెంచుకోవడానికి మాత్రమే వాడుకుంటున్నారని బన్సల్ అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం. తెలంగాణలో ప్రస్తుతం ఇదే తీరు కొనసాగుతోందని, దీన్ని తక్షణమే మార్చుకోవాలని హితోపదేశం చేసినట్లు టాక్. తెలంగాణ బీజేపీలోని గ్రూపు రాజకీయాలపైనా ఆయన తీవ్రంగా మండిపడినట్లు తెలుస్తోంది. నాయకుల చుట్టూ తిరగడం ఆపాలని, సొంత నియోజకవర్గాల్లో బూత్ స్థాయి నుంచి సొంత రాజకీయ బలాన్ని పెంచుకోవాలంటూ నేతలకు దిశా నిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. పార్టీలో ప్రతి కార్యకర్త ఒక లీడరే అని, అలాగే ప్రతి లీడర్ ఒక సాధారణ కార్యకర్లే అని, ఎవరైనా క్షేత్రస్థాయిలో కష్టపడాల్సిందేనని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద నేతలు వస్తారు.. ఎన్నికల ప్రచారం చేసి ఏదో మ్యాజిక్ చేస్తారు.. తాము గెలిచేస్తామనే భ్రమ నుంచి బయటకు రావాలని బన్సల్ హెచ్చరించినట్లు టాక్. కేంద్ర నాయకత్వం కేవలం మద్దతు మాత్రమే ఇస్తుందని, క్షేత్రస్థాయిలో ప్రజల మనసులు గెలుచుకుని, ఓట్లు రాబట్టే బాధ్యత పూర్తిగా స్థానిక నేతలదేనని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.
Also read; Vehicle Dealers: టీఆర్ నెంబర్ లేకుండా బండి డెలివరీ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!
ఇటీవల పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడం వెనుక ఉన్న క్షేత్రస్థాయి వ్యూహాలను బన్సల్ ఉదాహరణగా చూపిస్తూ తెలంగాణ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అరాచకాలను ఎదుర్కొంటూ, దాదాపు 15 వేల మంది బీజేపీ కార్యకర్తలు తప్పుడు కేసులతో జైళ్లపాలైనా వెనకడుగు వేయకుండా పార్టీ కోసం ప్రాణాలొడ్డి పోరాడారని గుర్తు చేసినట్లు వినికిడి. అలాంటి త్యాగనిరతి, కసి తెలంగాణలోని లీడర్లలో ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలోని జిల్లా, మండల కమిటీల్లో చాలా మంది ఆఫీస్ బేరర్లు అసలు పనిచేయడం లేదని బన్సల్ స్పష్టంచేసినట్లు తెలుస్తోంది.
ఎవరు పని చేస్తున్నారు? ఎవరు ఇంట్లో కూర్చుంటున్నారనేది తమకు తెలుసని, కేవలం పెద్ద నేతలకు దగ్గరగా ఉన్నారనే కారణంతో ఎవరికీ పదవులు దక్కవని, కేవలం బూత్ స్థాయిలో చూపించే పనితీరు ఆధారంగానే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని అధిష్టానం తరఫున కఠిన సంకేతాలు పంపినట్లు టాక్. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో వస్తున్న అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలని, అంతర్గత విబేధాలు పక్కనపెట్టి తక్షణమే గ్రామాల్లోని రైతులు, నిరుద్యోగుల సమస్యలపై పోరాటాలు ఉధృతం చేయాలని బన్సల్ దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. ఈ కీలక సమావేశంతో తెలంగాణ బీజేపీ నేతల్లో సరికొత్త అలజడి మొదలైంది. మరి ఆయన హితోపదేశానికి అనుగుణంగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు టీబీజేపీ నేతలు శ్రమిస్తారా? లేక లైట్ తీసుకుంటారా? అనేది చూడాలి.
Also read: కవిత అరెస్టు పర్వంలో పోలీస్ దాష్టీకం..! ఈడ్చుకెళ్లి.. రాళ్లపై పడేసి.. కారు డోరుకు ఢీకొట్టి..!