School Teachers: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను నివారించేందుకు, విద్యాసంవత్సరాన్ని సజావుగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మిగులు పాఠశాలల నుంచి ఉపాధ్యాయుల అవసరమున్న పాఠశాలలకు పని సర్దుబాటు ప్రాతిపదికన వెళ్లిన ఉపాధ్యాయులను ప్రస్తుతానికి రిలీవ్ చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు డాక్టర్ ఈ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు దీన్ని అమలు చేయాలని ఆదేశించారు.
గత విద్యాసంవత్సరం(2025-26)లో భాగంగా అవసరమున్న పాఠశాలలకు డెప్యూటేషన్పై వెళ్లిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయవద్దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సదరు పాఠశాలల్లో సంబంధిత సబ్జెక్టు టీచర్ల అవసరం ఇంకా ఉంటే వారు ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలల్లోనే విధులను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.
Also Read: రేవంత్ సర్కార్పై రాంచందర్ రావు నిప్పులు.. ‘జాబ్ క్యాలెండర్’ ఎక్కడంటూ ప్రశ్నల వర్షం!
అదేవిధంగా, ఉపాధ్యాయుల పదవీ విరమణ, దీర్ఘకాలిక సెలవులు లేదా ఇతర కారణాల వల్ల పాఠశాలల్లో కొత్తగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను చేపట్టాలని డీఈవోలను ఆదేశించారు. జూన్ 20 నాటికి పాఠశాలల్లో నమోదైన విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని, సబ్జెక్టుల వారీగా ఉన్న అవసరాలను విశ్లేషించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సర్దుబాటు ప్రక్రియ మొత్తాన్ని నిబంధనల ప్రకారం, సంబంధిత జిల్లా కలెక్టర్ల తుది ఆమోదంతోనే పూర్తి చేయాలని డైరెక్టర్ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
Also Read: BSNL ఆల్ రౌండర్ ప్లాన్.. ఇదొక్కటి చాలు మామ.. 70 రోజులు తిరుగుండదు!