Ponnam Prabhakar: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కొంతమంది కార్మిక సంఘాల నాయకులు వాస్తవాలను వక్రీకరిస్తూ కార్మికులను, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం బాధాకరమని అన్నారు. ఈ మేరకు శనివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రుల ఉపసంఘం.. 30 మంది కార్మిక సంఘాల ప్రతినిధులతో 14 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించినట్లు మంత్రి తెలిపారు. అందరి ఆమోదంతో ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకున్నామని గుర్తు చేశారు. మొత్తం 32 డిమాండ్లలో 29 అంశాలు ఆర్టీసీ యాజమాన్యం పరిధిలో, మూడు అంశాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నట్లు నిర్ణయించామన్నారు. యాజమాన్యం పరిధిలో ఉన్న 29 అంశాల పరిష్కారానికి ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ పరిధిలో ఉన్న మూడు కీలక అంశాలైన ఆర్టీసీ గుర్తింపు సంఘాల ఎన్నికలు, 2021 పీఆర్సీ, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనంలో.. పీఆర్సీ 11 శాతం జూలై నెల జీతాల నుంచే అమల్లోకి రానుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల మొదటి డిమాండ్ ఆర్టీసీ గుర్తింపు సంఘాలు ఎన్నికలు అని ఇప్పుడు మాట మార్చి ప్రజలను, కార్మికులను పక్కదోవ పట్టించడం సరికాదన్నారు. ఆర్టీసీ విలీనానికి సంబంధించి విధివిధానాలు రూపొందించే అధికారుల కమిటీలో కార్మిక ప్రతినిధులు తప్పనిసరిగా ఉండాలని సమావేశంలో కార్మికులు ఏకగ్రీవంగా నిర్ణయించారని మంత్రి పేర్కొన్నారు. అయితే ఆ కమిటీలో ఉండే కార్మిక నాయకులు గుర్తింపు పొందిన సంఘం నుంచి ఉండాలంటే ముందుగా గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయం అందరి సమక్షంలో తీసుకున్నామని వెల్లడించారు.
దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఇప్పటికే గుర్తింపు సంఘాల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించిందని, లేబర్ జాయింట్ కమిషనర్ సునీతను ఎన్నికల నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి త్వరలోనే గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించే దిశగా వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. కార్మికుల ప్రయోజనాలను కాపాడేందుకే ముందుగా గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించి, ఆ సంఘం నుంచి ప్రతినిధులను విలీన కమిటీలో చేర్చే ప్రక్రియను ప్రభుత్వం అనుసరిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ మాదిరి విలీనం తర్వాత ఇబ్బందులు కలగవద్దని గుర్తింపు కార్మిక సంఘాల నేతలను కమిటీ లో చేర్చి విధివిధానాలు రూపొందించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు.
Also Read: యువతిని చంపబోయాడు.. చివరికి తానే పేలిపోయాడు.. చిత్రవిచిత్ర ఘటన
ఈ పరిస్థితుల్లో కొంతమంది కార్మిక సంఘాల నాయకులు గుర్తింపు సంఘాల ఎన్నికలు జరగకుండా, విలీన ప్రక్రియను కూడా వివాదాస్పదం చేసేలా వ్యవహరించడం సరికాదని మంత్రి అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తోందని, కార్మికులు వాస్తవాలను గుర్తించి అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. మాట మీద నిలబడే కాంగ్రెస్ ప్రభుత్వం విలీన ప్రక్రియ గురించి భవిష్యత్ లో ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని గుర్తింపు సంఘం కార్మిక నేతలను కమిటీ లో చేర్చి విలీన విధివిధానాలు రూపొందించాలని భావిస్తున్నట్లు చెప్పారు. దీనిని సమస్త కార్మిక లోకం గమనించాలని కోరారు.
Also Read: కేటీఆర్ హోం మంత్రిని చేస్తానంటుంటే..! నేనెందుకు పోతా కాంగ్రెస్లోకి..!