Uttam Kumar: తెలంగాణ ప్రజల భద్రత, ప్రజాధనం రక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ విజయవిహార్లో నీటిపారుదల శాఖాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
కాళేశ్వరం బ్యారేజీలపై కీలక నిర్ణయం
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల మరమ్మతులు పూర్తిగా పూర్తయిన తర్వాతే వాటి నిర్వహణ చేపడతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA), సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) నుంచి స్పష్టమైన అనుమతులు వచ్చిన తర్వాతే బ్యారేజీల్లో నీటిని నిల్వ చేస్తామన్నారు. సుమారు రూ.1.10 లక్షల కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ఈ ప్రాజెక్టును కాపాడటం తమ ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. రాజకీయాల కంటే ప్రజల ప్రాణ భద్రతకే తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందని, ఇందులో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేశారు.
Also Read: కల్తీగాళ్లపై హెచ్-ఫాస్ట్ ఉక్కుపాదం.. 100 రోజుల్లో 185 కేసులు, 121 టన్నుల ఆహారం సీజ్!
మంత్రి హెచ్చరికలు
మరమ్మతులు పూర్తి కాకుండానే బ్యారేజీల నిర్వహణ చేపడితే అది తీవ్ర ప్రమాదకరంగా మారుతుందని మంత్రి హెచ్చరించారు. భద్రాచలం సహా నది దిగువన ఉన్న దాదాపు 40 గ్రామాల ప్రజల రక్షణ తమకు అత్యంత ముఖ్యమన్నారు. ప్రస్తుతం NDSA, CWC, CWPRS తో పాటు అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో, పూర్తి శాస్త్రీయ విధానంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. నిపుణుల సూచనల మేరకే ప్రస్తుతం అన్ని గేట్లను ఎత్తి ఉంచామని, భద్రతపై వంద శాతం నమ్మకం వచ్చాకే బ్యారేజీలను వినియోగంలోకి తెస్తామని వివరించారు.
అధికారులకు ఆదేశాలు
నాగార్జున సాగర్ డ్యామ్ భద్రతకు కూడా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. డ్యామ్కు అవసరమైన మరమ్మతులపై తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే, లైనింగ్ అవసరమైన సాగునీటి కాలువల పనులను వెంటనే ప్రారంభించాలని, పట్టణ ప్రాంతాల్లో ఉన్న ఓపెన్ కాలువలను దశలవారీగా కప్పివేసేలా (క్లోజ్డ్ కాలువలుగా) చర్యలు తీసుకోవాలని చెప్పారు. సాగునీటి పనుల్లో నాణ్యతతో పాటు వేగానికి సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, నిర్దేశిత గడువులోనే పనులన్నీ పూర్తి కావాలని స్పష్టం చేశారు.
రైస్ మిల్లు ప్రారంభం
గత ప్రభుత్వం కాగితాలకే పరిమితం చేసిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అమలు చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే గుల్లపోతులగండి, కేశవాపూర్, నెల్లికల్లు ఎత్తిపోతల పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. అంతకుముందు మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన ఆధునిక ఎగుమతి రైస్ మిల్లును మంత్రి ప్రారంభించారు.
Also Read: యజమాని కోసం రైల్వే స్టేషనే ఇల్లుగా మార్చుకున్న ఆవు!