ఈ రోజుల్లో అత్యాధునిక విమానాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికులను వేగంగా గమ్యస్థానానికి చేర్చుతున్నాయి. బిజినెస్ క్లాస్ సీట్లతో లగ్జరీ ప్రయాణాన్ని అందిస్తున్నాయి. అయితే, 1940 చివరలోనే ఇంతకు మించి లగ్జరీ ప్రయాణ అనుభవాన్ని అందించాయి కొన్ని విమానయాన సంస్థలు. ఆ కాలంలో విమాన ప్రయాణాన్ని ఒక విలాసవంతమైన అనుభవంగా మార్చేందుకు ప్రయత్నించాయి. ప్రయాణికులకు ఫైవ్ స్టార్ హోటల్ తరహా సేవలు అందించి ఆకట్టుకున్నాయి.
ఆ రోజుల్లో లగ్జరీ విమానాల్లో బాగా పాపులర్ అయిన ఫ్లైట్ బోయింగ్ 377 స్ట్రాటోక్రూయిజర్. ఈ విమానాన్ని పాన్ అమెరికన్ వరల్డ్ ఎయిర్వే స్ తో పాటు మరికొన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు ఉపయోగించేవి. అప్పట్లో ఇది ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన ప్రయాణీకుల విమానాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. బోయింగ్ 377 స్ట్రాటోక్రూయిజర్ ను రెండో ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన B 29 బాంబర్ ఆధారంగా రూపొందించారు. అయితే, దీనిని పూర్తిగా ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు.
ఈ విమానంలో విశాలమైన సీట్లు, పెద్ద క్యాబిన్లు ఉండేవి. సుదూర మార్గాల్లో ప్రయాణించే వాళ్లు నిద్రించేందుకు ప్రత్యేక బెర్త్ లను కూడా ఏర్పాటు చేసేవారు. ఈ విమానంలో మరో ప్రత్యేక ఆకర్షణ కింది అంతస్తులో ఏర్పాటు చేసిన లాంజ్. ప్రయాణికులు అక్కడ కూర్చుని విశ్రాంతి తీసుకునే వాళ్లు. ఇతర ప్రయాణికులతో మాట్లాడుకునే అవకాశం కూడా ఉండేది. ఇప్పటి విమానాల్లో కనిపించని ఈ సౌకర్యం అప్పట్లో చాలా ప్రత్యేకంగా ఉండేది.
భోజన విషయంలో కూడా స్ట్రాటోక్రూయిజర్ ప్రత్యేక గుర్తింపు పొందింది. సాధారణ ప్లాస్టిక్ ట్రేల్లో కాకుండా, పింగాణీ పాత్రల్లో భోజనం వడ్డించేవారు. రాగి చెంచాలు, ఫోర్కులు, కత్తులతో రెస్టారెంట్ తరహా డైనింగ్ ఎక్స్ పీరియెన్స్ కల్పించేవారు. ప్రయాణికులకు రోస్ట్ టర్కీ, స్టీక్, లాబ్స్టర్, కావియార్ లాంటి ఖరీదైన వంటకాలను కూడా అందించేవారు. 1949లో ఓ విమాన ప్రయాణంలో ప్రయాణికులకు టర్కీ డిన్నర్ వడ్డించిన ఘటన అప్పట్లో సంచలనం కలిగించింది.
స్ట్రాటోక్రూయిజర్ గంటకు సుమారు 340 మైళ్ల వేగంతో ప్రయాణించేది. ఇందులో దాదాపు 100 మంది ప్రయాణికులు ప్రయాణించేవారు. తక్కువ మంది ప్రయాణికులతో ఎక్కువ సౌకర్యాలు కల్పించడమే దీని ప్రత్యేకత. అయితే, ఈ విమానంలో ప్రయాణించాలంటే పెద్ద మొత్తంలో ఖర్చు అయ్యేది. 1940ల చివరలో అట్లాంటిక్ సముద్రాన్ని దాటే విమాన టికెట్ ధర వేల డాలర్లకు సమానంగా ఉండేది. అందువల్ల ఈ సేవలను ప్రధానంగా ధనికులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు మాత్రమే ఉపయోగించేవారు. 1950 చివరలో బోయింగ్ 707 వంటి జెట్ విమానాలు అందుబాటులోకి రావడంతో విమాన ప్రయాణంలో పెద్ద మార్పులు మొదలయ్యాయి.
Read Also: సీటు మార్చిన ఎయిర్ ఇండియాకు భారీ షాక్.. ఏకంగా రూ.60 వేల జరిమానా!