No Railway Line Even in 2026: భారత్ లో రైల్వే నెట్ వర్క్ రోజురోజుకూ విస్తరిస్తోంది. వందే భారత్ లాంటి వేగవంతమైన రైళ్లు దేశ వ్యాప్తంగా పరుగులు తీస్తున్నాయి. అయినప్పటికీ దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ రైలు సౌకర్యం అందుబాటులో లేదు. ముఖ్యంగా కేరళలోని వయనాడ్, ఇడుక్కి, కర్ణాటకలోని కొడగు జిల్లాలు రైల్వే మ్యాప్కు దూరంగా ఉన్నాయి. ఎందుకనేది ఇప్పుడు తెలుసుకుందాం..
కేరళలోని వయనాడ్ పశ్చిమ కనుమల్లో ఉన్న ఎత్తైన జిల్లా. ఇక్కడ ఇప్పటి వరకు రైల్వే లైన్, రైల్వే స్టేషన్ లేదు. వయనాడ్కు వెళ్లే ప్రయాణికులు సాధారణంగా కోజికోడ్ వరకు రైలులో వెళ్లి, అక్కడి నుంచి బస్సులు, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తారు. కోజికోడ్ నుంచి వయనాడ్ కు వెళ్లే మార్గం ఎక్కువగా ఘాట్ రోడ్లతో ఉంటుంది.
కర్ణాటకలోని కొడగు, కూర్గ్ కూడా రైల్వే సౌకర్యం లేని జిల్లాగా ఉంది. కాఫీ తోటలు, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతానికి సమీపంలోని ప్రధాన రైల్వే కేంద్రం మైసూరు. కొడగు ప్రజలు ప్రయాణికుల రవాణా కోసం ప్రధానంగా బస్సులు, ట్యాక్సీలు, ప్రైవేట్ వాహనాలపై ఆధారపడుతున్నారు.
కేరళలోని మరో కొండ జిల్లా ఇడుక్కి. తేయాకు తోటలు, పర్యాటక ప్రాంతాలతో ప్రసిద్ధి చెందిన ఈ జిల్లాలో కూడా రైల్వే లైన్ లేదు. ఎర్నాకులం, కొట్టాయం లాంటి ప్రాంతాల నుంచి రోడ్డు మార్గంలోనే ఇడుక్కికి చేరుకోవాల్సి ఉంటుంది. కొండ ప్రాంతం కావడంతో రైల్వే నిర్మాణం అంత సులభం కాదు.
ఈ జిల్లాలకు రైల్వే మార్గాలు రాకపోవడానికి ప్రధాన కారణాల్లో పశ్చిమ కనుమల భౌగోళిక పరిస్థితులు ఒకటి. ఇక్కడ కొండలు, లోయలు, దట్టమైన అడవులు ఎక్కువగా ఉన్నాయి. రైల్వే లైన్ నిర్మాణానికి పెద్ద ఎత్తున భూసేకరణ, సొరంగాలు, వంతెనలు అవసరం అవుతాయి. దీంతో ప్రాజెక్టు ఖర్చు కూడా భారీగా పెరుగుతుంది. పశ్చిమ కనుమలు జీవవైవిధ్యానికి ముఖ్యమైన ప్రాంతం. అడవులు, వన్యప్రాణుల ఆవాసాలకు నష్టం కలగకుండా నిర్మాణాలు చేపట్టాలని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. అందుకే కొన్ని రైల్వే ప్రతిపాదనలకు అనుమతులు పొందడం కష్టంగా మారుతోంది.
కేరళలో అంగమాలి–ఎరుమేలి మధ్య శబరి రైల్వే ప్రాజెక్ట్ చాలా కాలంగా చర్చలో ఉంది. ఈ మార్గం పూర్తయితే పర్వత ప్రాంతాలకు రైలు కనెక్టివిటీ మెరుగుపడే అవకాశం ఉంది. అయితే, భూసేకరణ, పరిహారం లాంటి అంశాల కారణంగా పనులు వేగంతో ముందుకు సాగలేదు. రైల్వే ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో కొండ ప్రాంతాలకు రోడ్డు కనెక్టివిటీని మెరుగుపరచడంపై ప్రభుత్వాలు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయి. మైసూరు–కుశాల్నగర్ లాంటి రహదారి ప్రాజెక్టులు కొడగును ప్రధాన నగరాలతో అనుసంధానించడంలో కీలకంగా మారుతున్నాయి.
Read Also: ‘పెద్ది’ సినిమాలో రైలు వెనుక ఇంత కథ ఉందా? అసలు ఆ ట్రైన్ ఇండియన్ రైల్వేది కాదా?