Alluri Sitarama Raju International Airport: ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అల్లూరి సీతారామరాజు (భోగాపురం) అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రెడీ అవుతోంది. అత్యాధునిక సాంకేతికత, భారీ మౌలిక వసతులు, అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం జరుపుకుంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే పర్యాటకం, వ్యాపారం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు మరింత వేగంగా పెరగనున్నాయి.
సుమారు రూ.4,500 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ అంతర్జాతీయ విమానాశ్రయం విజయనగరం జిల్లా భోగాపురం ప్రాంతంలో ఉంది. ఇది విశాఖపట్నం నగరానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో నిర్మాణం జరుపుకుంటుంది. భవిష్యత్తులో ఉత్తరాంధ్రకు ఎయిర్ ట్రావెల్ హబ్ గా మార బోతోంది.
ఈ విమానాశ్రయంలోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటి 3.8 కిలోమీటర్ల పొడవైన రన్ వే. ఇది దేశంలోనే అత్యంత పొడవైన రన్ వేలలో ఒకటిగా నిలవనుంది. ఇంత పెద్ద రన్ వే మూలంగా ప్రపంచంలో అతిపెద్ద ప్యాసింజర్ విమానాల్లో ఒకటైన ఎయిర్బస్ A380 లాంటి భారీ విమానాలు కూడా ఇక్కడ సులభంగా ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులను మరింత ఈజీగా మెయింటెయిన్ చేసే అవకాశం ఉంది.
ప్రయాణికుల కోసం అత్యాధునిక టెర్మినల్ బిల్డింగ్ ను రూపొందిస్తున్నారు. విశాలమైన వెయిటింగ్ ఏరియాలు, ఆధునిక చెక్ ఇన్ కౌంటర్లు, డిజిటల్ సర్వీసులు, మెరుగైన భద్రతా వ్యవస్థలు, సౌకర్యవంతమైన ప్రయాణ ఏర్పాట్ల లాంటి అన్ని సదుపాయాలు ఇందులో ఉండనున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఇంటీరియర్స్ ను అభివృద్ధి చేస్తున్నారు.
ఈ విమానాశ్రయం మొదటి దశలోనే సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యంతో నిర్మించబడుతోంది. ప్రయాణికుల రద్దీ పెరిగే కొద్దీ భవిష్యత్తులో దీన్ని మరింత విస్తరించే అవకాశం ఉంది. అంతేకాకుండా భారీ స్థాయిలో కార్గో రవాణా నిర్వహించేలా ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు, సీఫుడ్ ఉత్పత్తులు, పారిశ్రామిక వస్తువుల ఎగుమతులకు ఈ విమానాశ్రయం ఎంతో ఉపయోగపడనుంది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్రలో పర్యాటక రంగానికి మరింత ఊపు రానుంది. అరకు, బొర్రా గుహలు, విశాఖ బీచ్లు, సింహాచలం లాంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు దేశ, విదేశాల నుంచి మరింత మంది పర్యాటకులు వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త పరిశ్రమలు, ఐటీ సంస్థలు, లాజిస్టిక్స్ రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే, అల్లూరి సీతారామరాజు (భోగాపురం) అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం ఒక కొత్త ఎయిర్పోర్ట్ మాత్రమే కాదు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త అవకాశాలు కల్పించే కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుగా గుర్తింపు తెచ్చుకోనుంది. ప్రపంచ స్థాయి సౌకర్యాలు, భారీ రన్ వే, పెద్ద సంఖ్యలో ప్రయాణికుల సామర్థ్యం, కార్గో సేవలతో ఈ విమానాశ్రయం భవిష్యత్తులో ఏపీలో వైమానిక కేంద్రంగా మారే అవకాశం ఉంది.
Read Also: వందేభారత్ రైల్లో స్పెషల్ కమాండోలు.. కారణం ఏంటంటే?