Hyderabad Railway News: దసరా పండుగ సమీపిస్తున్న వేళ దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సమయంలో రైళ్లలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా లింగంపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు హైటెక్ సిటీ స్టేషన్లో పలు రైళ్లకు తాత్కాలికంగా హాల్ట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
హైటెక్ సిటీలో తాత్కాలికంగా ఆగే రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. నరసాపురం నుంచి లింగంపల్లి వెళ్లే రైలు నంబర్ 17255 హైటెక్ సిటీలో తెల్లవారుజామున 4:45 గంటలకు చేరుకుని 4:46 గంటలకు బయల్దేరుతుంది. అదే విధంగా లింగంపల్లి నుంచి నరసాపురం వెళ్లే 17256 రైలు రాత్రి 9:08 గంటలకు హైటెక్ సిటీకి చేరుకుని 9:09 గంటలకు బయల్దేరుతుంది. కాకినాడ టౌన్ నుంచి లింగంపల్లి వచ్చే 12775 రైలు ఉదయం 7:10 గంటలకు హైటెక్ సిటీలో ఆగి, 7:11 గంటలకు బయల్దేరుతుంది. లింగంపల్లి నుంచి కాకినాడ టౌన్ వెళ్లే 12776 రైలు సాయంత్రం 7:08 గంటలకు చేరుకుని 7:09 గంటలకు బయల్దేరుతుంది.
దసరా సీజన్ను దృష్టిలో పెట్టుకుని ఈ తాత్కాలిక హాల్టింగ్ అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 26 వరకు కొనసాగుతుంది. మొత్తం 18 రోజుల పాటు రైళ్లు హైటెక్ సిటీ స్టేషన్లో ఆగనున్నాయి. పండుగ సమయంలో సొంత ఊళ్లకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
అటు ఇప్పటికే లింగంపల్లి స్టేషన్ నుంచి ప్రయాణానికి టికెట్ రిజర్వ్ చేసుకున్న ప్రయాణికులకు కూడా ఈ అవకాశం ఉపయోగపడనుంది. అవసరమైతే రైల్వే నిబంధనల ప్రకారం ఎలాంటి అదనపు ఛార్జీ చెల్లించకుండానే తమ బోర్డింగ్ పాయింట్ను హైటెక్ సిటీ స్టేషన్ కు మార్చుకోవచ్చు. అయితే, బోర్డింగ్ పాయింట్ మార్పు కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న రైల్వే విధానాలను ప్రయాణికులు పాటించాల్సి ఉంటుంది. దీంతో లింగంపల్లి స్టేషన్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా హైటెక్ సిటీ నుంచే రైలు ఎక్కే అవకాశం ఉంటుంది.
దసరా సందర్భంగా రైల్వే స్టేషన్లలో సాధారణ రోజులతో పోలిస్తే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడటంతో పాటు స్టేషన్లలో జనాలను నియంత్రించేందుకు ఈ తాత్కాలిక హాల్ట్ లు ఉపయోగపడనున్నాయి. ప్రయాణికులు తమకు అనుకూలంగా ఉండే స్టేషన్ నుంచి రైలు ఎక్కి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. పండుగ సమయంలో రద్దీని దృష్టిలో పెట్టుకుని ముందుగానే ట్రావెల్ అరెంజెమెంట్స్ చేసుకోవడం మంచిదని తెలిపింది.
Read Also: తెలంగాణకు గుడ్ న్యూస్.. 2 అమృత్ భారత్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!