కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అత్యాధునిక రైళ్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇప్పటికే సెమీ హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి రాగా, త్వరలోనే దేశీ హైస్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నది. అదే సమయంలో హైడ్రోజన్ రైళ్లను కూడా పరిచయం చేయాలని భావిస్తున్నది. ఇప్పటికే అహ్మదాబాద్ నుంచి ముంబైకి బుల్లెట్ రైలు కారిడార్ కు సంబంధించిన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. సౌత్ లోనూ బుల్లెట్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ రైళ్లను హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై మార్గాల్లో ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
విమాన ప్రయాణానికి దీటుగా రైలు ప్రయాణం
ఈ హైస్పీడ్ రైలు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కేవలం 2 గంటల్లో చేరుకోనున్నట్లు సమాచారం. అటు హైదరాబాద్ నుంచి చెన్నైకి సుమారు 2 గంటల 20 నిమిషాలు పట్టే అవకాశం ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాణాళికలు రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు వెళ్లేందుకు సుమారు 1.15 గంటల సమయం పడుతుంది. అటు హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్లేందుకు 1.20 గంటల సమయం తీసుకుంటుంది. ఇక ఎయిర్ పోర్టు నుంచి ఇంటికి వెళ్లే సరికి సుమారు 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఈ టైమ్ బ్యాలెన్స్ అయ్యేలా హైస్పీడ్ రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందట.
ప్రయాణ సమయం 10 గంటలకు తగ్గించేలా నిర్ణయం!
హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నైకి హైస్పీడ్ రైల్వే కారిడార్ల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతాల మధ్య ప్రయాణ వ్యవధిని సుమారు 10 గంటలు తగ్గించాలని మోడీ సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారిడార్లలో హైస్పీడ్ రైళ్లు గంటకు సుమారు 320 కిలో మీటర్ల వేగంతో నడిచేలా చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇందుకోసం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 626 కిలో మీటర్ల కారిడార్ ను నిర్మించాలని భావిస్తున్నది. అటు హైదరాబాద్ నుంచి చెన్నై కారిడార్ ను 705 కిలో మీటర్ల పరిధిలో విస్తరించాలని ఆలోచిస్తున్నది. ఈ మార్గాలకు సంబంధించిన సర్వే బాధ్యతలను ఆర్ఐటీఈఎస్ సంస్థకు కేంద్ర ప్రభుత్వం అప్పగించనున్నట్లు తెలుస్తున్నది. ఈ సర్వేకు సుమారు రూ. 33 కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారట.
Read Also: గుడ్ న్యూస్.. ఇక ఆ స్టేషన్లోనూ ఆగనున్న సికింద్రాబాద్ – విశాఖ వందే భారత్ రైలు!
సంప్రదాయ రైల్వే లైన్లకు పూర్తి భిన్నంగా..
ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైల్వే లైన్లకు పూర్తి భిన్నంగా హైస్పీడ్ రైల్వే కారిడార్లు నిర్మించనున్నారు. ఈ రైళ్లకు ప్రత్యేక మార్గాన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం ముంబై- అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్వే కారిడార్ మాదిరగానే, హైదరాబాద్- బెంగళూరు, హైదరాబాద్ –చెన్నై హైస్పీడ్ రైల్వే కారిడార్లను నిర్మించనున్నారు. వీటిపై బుల్లెట్ రైళ్లకు అనుగుణంగా ఉండే ట్రాక్స్ ఏర్పడు చేయనున్నారు. ఇక ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు 2035లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ కారిడార్లు అందుబాటులోకి వచ్చేందుకు సుమారు 15 సంవత్సరాలు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
Read Also: గుడ్ న్యూస్, తెలుగు రాష్ట్రాలకూ ఓ వందేభారత్ స్లీపర్.. ఏ రూట్లో నడుస్తుందంటే?