Railway Test Track: ఇండియన్ రైల్వేస్ అత్యంత వేగంగా ఆధునికతను సంతరించుకుంటున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీని అందింపుచ్చుకుంటూ భారతీయ రైల్వే సంస్థ అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నది. ఇప్పటికే వందేభారత్, నమో భారత్ లాంటి హైస్పీడ్ రైళ్లను పరిచయం చేయగా, త్వరలోనే బుల్లెట్ రైళ్లను దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా దేశంలోనే తొలి డెడికేటెడ్ రైల్వే టెస్ట్ ట్రాక్ ను నిర్మిస్తోంది. రాజస్థాన్ లో ప్రస్తుతం ఈ ట్రాక్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 60 కిలో మీటర్ల మేర నిర్మిస్తున్న ఈ ట్రాక్ పనులు డిసెంబర్ 2025 నాటికి పూర్తవుతాయని భావిస్తున్నారు. ఈ ట్రాక్ మీద బుల్లెట్ రైళ్లతో సహా ఇతర హైస్పీడ్ రైళ్లను టెస్ట్ చేయనున్నారు.
రూ. 820 కోట్లతో టెస్టింగ్ ట్రాక్ నిర్మాణం
ఈ అత్యాధునిక టెస్టింగ్ రైల్వే ట్రాక్ ను రైల్వేస్ రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇందుకోసం సుమారు రూ. 820 కోట్లు ఖర్చు చేస్తోంది. జోధ్పూర్ డివిజన్ లోని నవా ప్రాంతంలో ఈ టెస్టింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేస్తున్నారు. జైపూర్ నుంచి ఇక్కడికి సుమారు 80 కి.మీ. దూరం ఉంటుంది. ఈ టెస్ట్ ట్రాక్ మీద హై-స్పీడ్, బుల్లెట్ రైళ్లు, మెట్రో రైళ్ల ట్రయల్స్, టెస్ట్ స్పీడ్ నిర్వహిస్తారు. ఈ ట్రాక్ స్ట్రెయిట్ ట్రాక్ కి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. అనేక వంకరలను కలిగి ఉంటుంది. నెమ్మదిగా ప్రయాణించే రైళ్ల నుంచి హై-స్పీడ్ బుల్లెట్ రైళ్ల వరకు వివిధ వేగంతో ఎలా హ్యాండిల్ అవుతాయో RDSO పరీక్షించనుంది.
కఠినతరంగా టెస్టింగ్ ట్రాక్ నిర్మాణం
టెస్ట్ ట్రాక్ నిర్మాణం విషయంలో రైల్వే సంస్థ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నది. అత్యంత కఠినతరంగా ఈ ట్రాక్ ను నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ లో ఏడు పెద్ద వంతెనలు, 129 చిన్న వంతెనలు, నాలుగు స్టేషన్లును నిర్మిస్తున్నారు. 60 కి. మీ ట్రాక్ ను నిర్మించాల్సి ఉండగా ఇప్పటి వరకు దాదాపు 27 కి.మీ పని పూర్తయింది. మిగతా పనులు అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి.
భారతీయ రైల్వేలో సరికొత్త శకం
భారతీయ రైల్వే సంస్థ 2030 వరకు దేశ ప్రజలకు బుల్లెట్ ట్రైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రయత్నిస్తోంది. ఈ బుల్లెట్ ట్రైన్లను జపాన్ నుంచి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. జపాన్ దివంగత ప్రధాని షింజో అబే సమయంలో ఈ బుల్లెట్ ట్రైన్లకు సంబంధించిన ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం భారత్ కు జపాన్ బుల్లెట్ ట్రైన్లను అందించనుంది. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే సంస్థ ప్రతిష్టాత్మకంగా టెస్ట్ రైల్వే ట్రాక్ ను నిర్మిస్తోంది. ఇకపై అన్ని రకాల రైళ్లను రాజస్థాన్ లోని ఈ ట్రాక్ మీదే పరీక్షించనున్నారు. కఠిన ప్రమాణాలతో కూడిని టెస్టులను ఇక్కడ నిర్వహించనున్నారు. భద్రతలో ఏమాత్రం రాజీ లేకుండా ఈ పరీక్షలు కొనసాగనున్నాయి.
Read Also: నీటి అడుగున వెళ్లే రైలు, అండర్ వాటర్ లో అద్భుతం గురించి మీకు తెలుసా?