Indian Railways: ప్రయాణీకులకు అనుగుణంగా రైల్వేశాఖ ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగా తత్కాల్ టికెట్ల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇవాళ్టి( జులై 15) నుంచి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. బుకింగ్ సౌలభ్యాన్ని మరింత మెరుగు పరిచేందుకు ఆన్ లైన్ , ఆఫ్ లైన్ తత్కాల్ టికెట్ బుకింగ్ లకు ఆధార్ ఆధారిత ఓటీపీని తప్పనిసరి చేసింది. అంతేకాదు, ఏజెంట్లు రద్దీ సమయాల్లో బుకింగ్ పరిమితులను ఎదుర్కొనే అవకాశం ఉంది. అటు ప్రీమియర్ సేవలకు రైలు ఛార్జీలు పెరగడంతో పాటు.. ప్రయాణీకుల సౌలభ్యాన్ని పెంచుతూ, రిజర్వేషన్ చార్టులను షెడ్యూల్ కు 8 గంటల ముందు డిస్ ప్లే చేయనున్నారు.
తత్కాల్ టికెట్ కోసం ఆధార్ ఓటీపీ ఉండాల్సిందే!
ఇవాళ్టి నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ లకు ఆధార్ ఆధారిత OTP ప్రామాణీకరణను తప్పనిసరి చేసింది రైల్వేశాఖ. తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే ప్రయాణీకుడు బుకింగ్ సందర్భంగా వారి ఆధార్ తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్ కు వచ్చిన OTPని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రైలు షెడ్యూల్ కు ఒక రోజు ముందు తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. 1A, 2A, 3A, CC, EC, AC తరగతులకు తత్కాల్ రైలు టికెట్లను ఉదయం 10:00 గంటల నుండి బుక్ చేసుకోవచ్చు. నాన్-AC తరగతులకు తత్కాల్ బుకింగ్ లు ఉదయం 11:00 గంటలకు ప్రారంభమవుతాయి. మీ యూజర్ ప్రొఫైల్ IRCTC యాప్లో ఆధార్ లింక్ చేయకపోతే తత్కాల్ రైలు టికెట్లను బుక్ చేసుకునే ఛాన్స్ ఉండదు.
IRCTCలో యూజర్ ప్రొఫైల్ ను ఆధార్ ఎలా లింక్ చేయాలి?
1.IRCTC వెబ్ సైట్ లేదంటే IRCTC రైల్ కనెక్ట్ యాప్కి లాగిన్ కావాలి.
2.మై అకౌంట్ లోకి వెళ్లాలి.
3.యూజర్ ను ప్రామాణీకరించు బటన్ మీద క్లిక్ చేయాలి.
4.వెంటనే మీ యూజర్ ప్రొఫైల్ తో ఆధార్ లింక్ అవుతుంది.
తత్కాల్ బుకింగ్ విషయంలో IRCTC మార్పులు
ఇక రైల్వే టికెట్ బుకింగ్ ఏజెంట్ల కోసం బుకింగ్ సమయ పరిమితిని ఈ నెల 1 నుంచి మార్చింది. నిజమైన ప్రయాణీకులకు మాత్రమే టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించేలా బుకింగ్ ఏజెంట్లపై పరిమితి విధించింది. AC తరగతుల టికెట్లను ఏజెంట్లు ఉదయం 10:00 నుంచి 10:30 గంటల మధ్య టికెట్లను బుక్ చేసుకోలేరు. నాన్ AC క్లాసులకు సంబంధించిన రైలు టిక్కెట్ల కోసం ఏజెంట్లు ఉదయం 11:00 నుంచి 11:30 గంటల మధ్య టికెట్లను బుక్ చేసుకోలేరు.
జూలై 1 నుంచి పెరిగిన రైలు ఛార్జీలు
భారతీయ రైల్వే జూలై 1 నుంచి రైలు ఛార్జీలను పెంచింది. రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, తేజస్, హమ్ సఫర్, అమృత్ భారత్, మహామన, గతిమాన్, అంత్యోదయ, జన్ శతాబ్ది, యువ ఎక్స్ప్రెస్, AC విస్టాడోమ్ కోచ్లు లాంటి ప్రీమియర్, ప్రత్యేక రైలు సేవలకు అధిక రైలు టికెట్ ధరలు వర్తిస్తున్నాయి.
షెడ్యూల్ కు 8 గంటల ముందే రిజర్వేషన్ చార్ట్
అటు రైలు బయలుదేరే ఎనిమిది గంటల ముందు రిజర్వేషన్ చార్ట్ను సిద్ధం చేయాలని నిర్ణయించింది. గతంలో రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు రిజర్వేషన్ చార్ట్ తయారు చేసేవారు. దీనివల్ల ప్రయాణీకులకు ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యాన్ని పొందే అవకాశం లేక ఇబ్బంది పడేవారు.
Read Also: ఇండియన్ రైళ్లలో అత్యంత సేఫ్ బెర్త్.. ఇదే బుక్ చేసుకోండి!