Sileru Tourist Places: రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమాలో అద్భుతమైన లొకేషన్లు ఆకట్టుకుంటున్నాయి. అచ్చం కేరళలోని అందాలను మరిపించేలా ఆహా అనిపిస్తున్నాయి. సినిమా చూసే వాళ్లంతా ఈ లొకేషన్లు ఎక్కడ ఉన్నాయా? అని ఆలోచిస్తున్నాయి. అయితే.. ఈ సినిమాలోని లొకేషన్లన్నీ ఆంధ్రప్రదేశ్ లోని సీలేరు ప్రాంతంలోని కావడం విశేషం. సినిమా షూటింగ్ లో ఎక్కువ భాగం సీలేరు, దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో చిత్రీకరించడంతో ఇప్పుడు ఆ అందమైన లొకేషన్లపై ఆసక్తి పెరిగింది. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, ఘాట్ రోడ్లు, జలపాతాలు, రిజర్వాయర్లు.. ప్రకృతిని ఇష్టపడేవారికి సీలేరు ఒక అద్భుతమైన ప్రదేశంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దుకు సమీపంలో, తూర్పు కనుమల మధ్య ఉన్న సీలేరు ప్రకృతి ప్రేమికులకు అద్భుతమైన డెస్టినేషన్ గా కొనసాగుతోంది.
సీలేరు ప్రాంతంలోని ప్రధాన ఆకర్షణల్లో డ్యామ్ ఒకటి. చుట్టూ కొండలు, అడవుల మధ్య విస్తరించిన నీటి జలాశయం ఎంతో అందంగా కనిపిస్తుంది. వర్షాకాలం తర్వాత ఇక్కడి ప్రకృతి మరింత పచ్చగా మారుతుంది. సాయంత్రం సమయంలో రిజర్వాయర్ పరిసరాల్లో కనిపించే దృశ్యాలు ఫొటోగ్రఫీకి కూడా అనుకూలంగా ఉంటుంది.
సీలేరు పరిసరాల్లో ఉన్న ధారకొండ జలపాతం ప్రకృతి అందాలకు మరో ఎగ్జాంఫుల్ గా చెప్పుకోవచ్చు. కొండల మధ్య నుంచి జాలువారే నీరు, చుట్టూ కనిపించే పచ్చదనం పర్యాటకులను ఆకట్టుకుంటాయి. వర్షాకాలం తర్వాత ఈ ప్రాంతం మరింత అందంగా కనిపించే అవకాశం ఉంటుంది.
సీలేరు సమీపంలో ఉన్న డోంకరాయి ప్రాంతం కూడా ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. ముఖ్యంగా ఈ మార్గంలో ప్రయాణమే ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. అడవులు, కొండలు, మలుపులతో కూడిన ఘాట్ రోడ్ల గుండా సాగే ప్రయాణం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటుంది.
ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దు ప్రాంతానికి దగ్గరగా ఉన్న బలిమెల రిజర్వాయర్ మరో అందమైన ప్రదేశం. విస్తారమైన నీటి ప్రవాహాలు, చుట్టూ కొండలు, పచ్చని వాతావరణం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. సినిమాలకు సహజమైన బ్యాక్డ్రాప్ కావాలనుకునే వారికి ఇలాంటి ప్రాంతాలు మంచి లొకేషన్లుగా మారుతున్నాయి.
సీలేరు ప్రయాణంలో లంబసింగి, చింతపల్లి ప్రాంతాలను కూడా సందర్శించవచ్చు. చల్లటి వాతావరణం, కొండలు, మేఘాలతో నిండిన ప్రకృతి దృశ్యాలకు ఈ ప్రాంతాలు ప్రసిద్ధి. ఒకే ట్రిప్ లో ఈ ప్రాంతాలను కలుపుకుని ప్రయాణం ప్లాన్ చేసుకుంటే మంచి ఎక్స్ పీరియెన్స్ పొందవచ్చు.
విశాఖపట్నం నుంచి సీలేరుకు రోడ్డు మార్గంలో సుమారు 200 కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది. ప్రయాణానికి సాధారణంగా 6 గంటల వరకు సమయం పడుతుంది. విశాఖపట్నం నుంచి అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లి మీదుగా సీలేరు చేరుకోవచ్చు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉంటాయి. విశాఖ రైల్వే స్టేషన్, భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి కూడా అక్కడికి చేరుకోవచ్చు. మొత్తానికి, ‘ఇరుముడి’ సినిమాలో కనిపించిన అందమైన ప్రకృతి దృశ్యాలు ఎక్కడివి అని తెలుసుకోవాలనుకునేవారు సీలేరుకు వెళ్లాల్సిందే. కొండలు, అడవులు, జలపాతాలు, రిజర్వాయర్ల మధ్య ఒక ప్రత్యేకమైన ప్రయాణ అనుభవం కావాలంటే సీలేరు ట్రిప్ ప్లాన్ చేసుకోవాల్సిందే.
Read Also: పశ్చిమ కనుమల్లో వందేభారత్ కనువిందు.. పచ్చని అడవిలో ఎర్రని మెరుపుతీగలా..