బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. స్టైలే వేరులా ఉంది. ఆయన తెలంగాణ టూర్లో అడిగిన అభ్యర్థన కొంచెం వెరైటీగా ఉంది. కానీ ఒక్క దగ్గరే బెడిసి కొట్టింది. సేమ్ టు సేమ్ కేటీఆర్ లెక్కనే ఓ మాటన్నాడు. మోడీ ముఖం చూడండి. అభ్యర్థులెవరనేది చూడకండి. బీజేపీకి అవకాశం ఇవ్వండి అని.
ఇద్దరికీ అవకాశం ఇచ్చారు.. అనేది బాగుంది. మాకూ ఇచ్చి చూడండి అనే అభ్యర్థన కూడా సబబుగానే ఉంది. ఇద్దరికీ అధికారం ఇచ్చిన తరువాత ప్రజలు వీరిద్దరి పట్ల తెలుసుకున్న నిజ స్వరూపమేమిటో కూడా తెలియజెప్పే ప్రయత్నం చేశాడు నితిన్. బీఆరెస్ గురించి ఆయన మాట్లాడుతూ.. ప్రజల కోసం కేసీఆర్ ఆలోచించలేదు. కేటీఆర్ పట్టించుకోలేదు. కేవలం వారి కుటుంబం గురించే వారికి ఆలోచన. అందుకే జనం వారిని చీత్కరించారు. ఫామ్హౌజ్కు పరిమితం చేశారు. అందుకే కాంగ్రెస్ను గెలిపించారన్నాడు.
అంటే ఆల్టర్నేట్ లేక కాంగ్రెస్ను గెలిపించారని,అది కాంగ్రెస్ మీద ప్రేమ కాదని, కేసీఆర్ కుటుంబ పాలన మీద కోపంతోనని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇక్కడి ప్రజలను నిలువునా మోసం చేసిందని విమర్శించారు నితిన్ నబీన్. అది కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని, హామీలివ్వడం, మరిచిపోవడం దానికి అలవాటేనన్నారు.
అందుకే మూడోసారి తమకు అధికారం ఇవ్వాలని ఆయన కోరారు. ఒక్కసారి చాన్స్ ఇచ్చి చూడండి అనే విధంగా ఆయన చేసిన అభ్యర్థన బాగానే ఉంది. జనానికి కూడా బాగానే కనెక్టయ్యింది. కానీ ఒక్క దగ్గరే పోగుట్టుకున్నాడు. మోడీ ముఖం చూడండి.. అభ్యర్థి ముఖం చూడొద్దని. సేమ్,, కేటీఆర్ లెక్కనే. బీఆరెస్ అక్కడే దెబ్బ తిన్నది.
మూడు మూడు సార్లు సిట్టింగులకే అవకాశం ఇచ్చింది. కేసీఆర్ను చూసి ఓటేస్తారనుకున్నది. కానీ లోకల్ ప్రయార్టీస్ను లెక్కలోకి తీసుకోలేదు. ఇప్పుడు ఓడిన తరువాత కూడా అదే మాట మాట్లాడుతున్నాడు కేటీఆర్. అభ్యర్థులెవరో కేసీఆర్ చూసుకుంటాడు. ప్రతీ అభ్యర్థి ముఖంలో కేసీఆర్ ముఖం చూసుకోవాలనే కొత్త ఫిలాసఫీ ఒకటి చెబుతూ వస్తున్నాడు.
అంటే ఇంకా వారు మారలేదన్నమాట. ఇంకా కేసీఆర్ ముఖమే చూడాలంటున్నారు. ఇక్కడ మోడీ ముఖమే చూడమంటున్నాడు నితిన్. కేసీఆర్ ముఖం చూసే రెండు సార్లు గెలిపించారు. ఇక మూడోసారి భరించలేకపోయారు. అందుకే కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ మీద ముఖం మొత్తింది. మరి మళ్లీ బీఆరెస్ వైపు చూస్తారా? ఒకసారి బీజేపీకి కూడా ఛాన్స్ ఇచ్చి చూద్దామనుకుంటారా?