జమ్మూకాశ్మీర్.. భారత్ లో అత్యంత అందమైన ప్రదేశం. ఒకప్పుడు నిత్యం ఉగ్రదాడులతో అల్లకల్లోలంగా ఉండే ఈ ప్రాంతం గత దశాబ్దకాలంగా ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని ఉగ్రదాడులు జరిగినప్పటికీ, మళ్లీ పరిస్థితులు సర్దుకున్నాయి. కాశ్మీర్ లో పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. అంతా ప్రశాంతంగా ఉందని భావిస్తున్న తరుణంలో పహల్గామ్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. టూరిస్టులపై తుపాకులతో విరుచుకుపడ్డారు. ఏకంగా 27 మంది కాల్చి చంపారు. పదుల సంఖ్యలో గాయాలయ్యాయి. ఈ ఘటనతో కాశ్మీర్ పర్యాటకం పూర్తి పడిపోయింది. కాశ్మీర్ అంతగా నిర్మానుష్యంగా మారిపోయింది.
కోలుకుంటున్న పర్యాటకరంగంపై తీవ్ర ప్రభావం
వాస్తవానికి పహల్గామ్ ఉగ్రదాడికి ముందు వరకు కాశ్మీర్ లోయ పర్యాటకులతో కళకళలాడింది. ఇప్పుడిప్పుడే పర్యాటక రంగం అభివృద్ధి బాటపట్టింది. కాశ్మీర్ లోయలోకి టూరిస్టులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న నేపథ్యంలో హోటళ్లు, లాడ్జీలు, పర్యాటక ప్రదేశాలు రద్దీగా మారాయి. ఈ దాడి తర్వాత కాశ్మీర్ లోయలో మళ్లీ భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. వాస్తవానికి గత ఏడాది కాశ్మీర్ కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. మొత్తం 2.36 కోట్ల మంది వచ్చినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. వీరిలో 27 లక్షల మంది కేవలం కాశ్మీర్ చూడ్డానికే వచ్చారట.
పర్యాటకులు లేకపోవడంతో స్థానికుల అవస్థలు
కాశ్మీర్ లోయలో వేలాది కుటుంబాలు పర్యాటక రంగం మీద ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. పర్యాటకులను తరలించేందుకు గుర్రాలను నడిపే వాళ్లు, ట్యాక్సీలు నడిపేవాళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు, ఆయా వస్తువులను అమ్ముకునే వాళ్లు టూరిజం మీద బతుకుతున్నారు. కానీ, ఇప్పుడు పర్యాటకులు రాకపోవడంతో వ్యాపారాలు క్లోజ్ అయ్యాయి. ఈ రంగం మీద ఆధారపడిన వాళ్లతంతా రోడ్డున పడ్డారు. పహల్గామ్ ఉగ్రదాడి తమ జీవితలపై కోలుకోలేని దెబ్బకొట్టిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం
జమ్మూకాశ్మీర్ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా మార్చేలా తగు చర్యలు తీసుకుంది. ఇందుకోసం ఏటా రూ. 2000 కోట్లు నిధులు కేటాయించాలని నిర్ణయించింది. కాశ్మీర్ లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు అడ్వెంచర్ టూరిజం, వెల్నెస్ టూరిజం, కుంకుమ పువ్వు సాగు, వారసత్వ, సాంస్కృతిక పర్యాటకాన్ని ప్రోత్సహించడంపై దృష్టి సాధించింది. అదే సమయంలో ఈ ప్రాంతానికి వందేభారత్ స్లీపర్ రైలును కూడా అందుబాటులోకి తీసుకురావాలని భావించింది. కానీ, ఉగ్రదాడి తర్వాత అన్ని ప్లాన్స్ తారుమారయ్యాయి. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కాశ్మీర్ లోని మొత్తం 87 పర్యాటక కేంద్రాల్లో 48 కేంద్రాలను క్లోజ్ చేశారు. గుల్మార్గ్, సోనామార్గ్, దాల్ సరస్సు తో పాటు పలు పర్యాటక ప్రదేశాల్లో భద్రతా దళాలు మోహరించాయి. కుప్వారా, బందిపోరా, బారాముల్లా, బడ్గాం జిల్లాలలోని వేలాది మంది రైతులు, కూలీల జీవనోపాధి పూర్తిగా దెబ్బతిన్నది. మళ్లీ సాధారణ పరిస్థితులు ఇప్పట్లో నెలకొనే అవకాశం కనిపించడం లేదు.
Read Also: జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన ప్రాంతాలు, సమ్మర్ లో ప్లాన్ చేసేయండి!