ఇకపై విదేశాలకు వెళ్లే భారతీయులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలకు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా సంస్థలకు చెందిన విమానాల్లో విదేశీయానం చేసే ప్రయాణీకులకు సంబంధించిన పూర్తి వివరాలను తప్పనిసరిగా కస్టమ్స్ అధికారులకు అందివ్వాలని ఆదేశించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. భారత్ కు రాకపోకలు సాగేంచే ప్రతి విమానానికి ఈ నిబంధనలు వర్తిస్తాయని తేల్చి చెప్పింది. ఈ నెల 10 లోగా నేషనల్ కస్టమ్స్ టార్గెటింగ్ సెంటర్ ప్యాసింజర్ (NCTC-Pax) లో విమాన సంస్థలు నమోదు చేసుకోవాలని కేంద్రం సూచించింది.
24 గంటల ముందే కస్టమ్స్ కు ప్రయాణీకుల వివరాలు
అంతర్జాతీయ విమానాలు బయల్దేరడానికి 24 గంటల ముందే సంబంధిత ప్రయాణీకులకు సంబంధించి మోబైల్ నెంబర్, టికెట్ PNR నెంబర్, టికెట్ కోసం డబ్బులు చెల్లించిన విధానం, ప్రయాణ వివరాలు, ఇ-మెయిల్, లగేజీ సమారం సహా అన్నీ విషయాలను కస్టమ్స్ అధికారుకు ఇవ్వాలని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ (CBIC) వెల్లడించింది. విమాన సంస్థ విదేశాలకు వెళ్లే ప్రయాణీకులకు సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడంలో విఫలం అయితే, రూ.25,000 నుంచి 50,000 వరకు ఫైన్ విధించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ విధానాన్ని ఫిబ్రవరి 10 నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Read Also: ఆ విమానాల్లో ఇక ఉచిత Wi-Fi.. ఎంజాయ్ చెయ్యండి మరి!
ఐటీ శాఖ నజర్ పెడుతుందా?
వాస్తవానికి భారతీయుల విదేశీ ప్రయాణాలకు సంబంధించి అతిధి యాప్ సాయంతో డీఆర్ఐ ద్వారా నిఘా పెట్టేది. ఇప్పుడు ఐటీ శాఖ కూడా విదేశీయానం చేసే భారతీయులపై నిఘా ఉంచనున్నట్లు తెలుస్తున్నది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను రూపొందిస్తున్నట్లు తెలుస్తున్నది. ఏప్రిల్ 1 నుంచి విదేశీ విమానయాన సంస్థల్లో ప్రయోగాత్మకంగా ఈ సాఫ్ట్ వేర్ ను పరిశీలించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, పన్ను ఎగవేతదారులను పట్టుకునేందుకు డిజీయాత్ర యాప్ డేటాను సేకరిస్తున్నట్లు వస్తున్న వార్తలను ఐటీశాఖ ఖండించింది. ఇప్పటి వరకు అలాంటి చర్యలు ఏవీ తీసుకోలేదని వెల్లడించింది.
Read Also: మేఘాలపై మనుషులు.. విమాన ప్రయాణికులకు వింత అనుభవం, వీడియో వైరల్!
అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడేనా?
గత కొంతకాలంగా విదేశాల నుంచి భారత్ కు అక్రమంగా బంగారం, డ్రగ్స్ సరఫరా అవుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకుల మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తున్నది. భారత్ కు వచ్చే విదేశీ ప్రయాణీకుల మీద కూడా స్పెషల్ నజర్ పెట్టబోతున్నారు. విదేశాల నుంచి భారత్ కు గత కొంత కాలంగా బంగారం, మాదక ద్రవ్యాలు, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు అక్రమంగా రవాణా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే విదేశీ ప్రయాణీకుల వివరాలను అందివ్వాలని ఆదేశించింది.
Read Also: ఇండియన్ రైల్వేలో మరో అద్భుతం, నదీ గర్భంలో దూసుకెళ్లే రైలు గురించి మీకు తెలుసా?