Indian Railways: ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ లలో భారతీయ రైల్వే ఒకటిగా కొనసాగుతోంది. అమెరికా, చైనా, రష్యా తర్వాత భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఇండియన్ రైల్వే ఆదాయాన్ని సృష్టించడంతో పాటు ఉపాధి, ఆర్థిక వృద్ధికి చోదక శక్తిగా కొనసాగుతోంది. గత కొంతకాలంగా దేశంలో అత్యాధునిక రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. అత్యంత వేగంగా, సౌకర్యవంతంగా ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. అయితే, ఈ రైళ్లను ప్రభుత్వం, నడుపుతుందా? ప్రైవేట్ సంస్థలు నడుపుతున్నాయా? అనే చర్చ జరుగుతోంది. ఇంతకీ వీటిని ఎవరు నడుపుతున్నారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు
భారతీయ రైల్వే ముఖ చిత్రాన్ని ఈ రైలు పూర్తిగా మార్చేసింది. అత్యాధునిక టెక్నాలజీతో ఈ రైలు రూపొందింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ICF) ఈ రైలును తయారు చేసింది. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా పూర్తి భారతీయ టెక్నాలజీతో తయారయ్యింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ గరిష్టంగా గంటకు 180 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. కానీ, పలు కారణాలతో గంటకు 160 కి.మీ. వేగానికి పరిమితం చేశారు. పూర్తిగా ఎయిర్ కండిషన్డ్, Wi-Fi, సౌకర్యవంతమైన సీటింగ్, మెరుగైన భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. ఈ రైలు ప్రయాణీకులకు ప్రీమియం ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది. ఈ రైలు పూర్తిగా భారతీయ రైల్వే యాజమాన్యంలో నడుస్తున్నది.
శతాబ్ది, రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్లు
వందే భారత్ రైలు అందుబాటులోకి రాకముందు శతాబ్ది, రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్లు దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. 1988లో ప్రారంభించబడిన శతాబ్ది ఎక్స్ ప్రెస్ వేగవంతమైన, సౌకర్యవంతమైన, టైమ్ పంక్చువాలిటీ కలిగి ఇంటర్ సిటీ ప్రయాణం కోసం రూపొందించబడింది. ఈ రైలు గంటకు 150 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై లాంటి ప్రధాన నగరాలను కలుపుతుంది.
ఇక 1969లో ప్రారంభంలో ప్రవేశపెట్టబడిన రాజధాని ఎక్స్ప్రెస్ ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు లాంటి ప్రధాన మెట్రోలకు అనుసంధానిస్తూ సుదూర ప్రయాణాలకు గేమ్ ఛేంజర్గా నిలిచింది. గంటకు 130 కి.మీ వేగంతో నడిచే రాజధాని రైళ్లు వేగం, సౌకర్యంతో పాటు అత్యుత్తమ సేవా ప్రమాణాలకు ప్రసిద్ధి చెందింది. శతాబ్ది, రాజధాని రైళ్లు రెండూ పూర్తిగా ప్రభుత్వ యాజమాన్యంలోని భారతీయ రైల్వే సంస్థ నడిపిస్తోంది.
Read Also: రైళ్లలో మోబైల్స్, ల్యాప్ టాప్స్ ఛార్జింగ్ చేస్తున్నారా? అయితే, మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే!
ప్రైవేట్ భాగస్వామ్యం దిశగా ప్రభుత్వం ఆలోచనలు
వందే భారత్, శతాబ్ది, రాజధాని లాంటి ఐకానిక్ రైళ్లు ప్రభుత్వ యాజమాన్యంలో కొనసాగుతున్నప్పటికీ, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) కింద వీటిని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. సర్వీస్ క్వాలిటీ, సామర్థ్యం, ప్రయాణీకుల ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోబోతోంది. అయితే, ప్రస్తుతానికి ఈ రైళ్లు ప్రభుత్వ ఆధీనంలోనే నడుస్తున్నాయి. ఎలాంటి ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యం లేదు.
Read Also: మే 1 నుంచి రైల్వే నయా రూల్.. స్లీపర్, ఏసీ బోగీల్లోకి నో ఎంట్రీ!