సాధారణంగా దొంగలు దొరికిన వస్తువులను దొరికినట్లే క్షణాల్లో మాయం చేస్తారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే దొంగలు కాస్త డిఫరెంట్. వాళ్లు దొంగతనం చేయాలంటే కలర్ కాంబినేషన్ చూస్తారు. కేవలం నలుపు, నీలం రంగు బ్యాగులను మాత్రమే కొట్టేస్తారు. ఎందుకు ఆ రెండు రంగుల బ్యాగులే కొట్టేస్తారో తెలియాలంటే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే!
నలుగురు దొంగలను అరెస్టు చేసిన పోలీసులు
ఢిల్లీలోని రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో నలుగురు ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారు. అయితే, వీళ్లు కేవలం నీలం, నలుపు రంగు బ్యాగులను మాత్రమే దొంగతనం చేస్తున్నట్లు గుర్తించారు. ఎందుకు ఈ రంగు బ్యాగులను మాత్రమే దొంగతనాలు చేస్తున్నారనే విషయంపై పోలీసులు ఆరా తీశారు. వారి తెలివికి పోలీసుల మైండ్ బ్లాంక్ అయ్యింది. “గురువారం న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లోని శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ నుంచి ఐదు బ్యాగులు దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు అందింది. వెంటనే కేసు నమోదు చేశాం. CCTV ఫుటేజ్ లను పరిశీలించి.. అనుమానిత ముఠాను పహార్ గంజ్ లోని ఒక హోటల్లో గుర్తించాం” అని రైల్వేస్ డీసీపీ మల్హోత్రా తెలిపారు. నిందితులను అమిత్ కుమార్ (37), కరణ్ కుమార్ (27), గౌరవ్ (33)గా గుర్తించినట్లు వెల్లడించారు. వీరందరూ బీహార్ కు చెందిన వారిగా గుర్తించామన్నారు.
బీహార్ లోనూ దొంగతనాలు చేసిన ముఠా
నిందితులో అమిత్ కు బీహార్, ఢిల్లీలో రైల్వే ప్రయాణికులను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడిన చరిత్ర ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. పునీత్ బీహార్, రాజస్థాన్, ఢిల్లీలలో దశాబ్ద కాలంగా నేరాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. మాదకద్రవ్యాల రవాణా, దోపిడీలు, దొంగతనాలు చేస్తున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి పోలీసులు మొత్తం 16 బ్యాగులు, రెండు మొబైల్ ఫోన్లు, రూ. 47,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.
బ్లాక్, బ్లూ బ్యాగులే ఎందుకు దొంగతనం చేస్తారంటే?
ఈ దొంగతనాలకు సంబంధించి పోలీసులకు ఓ ఆసక్తికర విషయం తెలిసింది. ముఖ్యంగా రద్దీగా ఉండే స్టేషన్లలో రైళ్లు ఎక్కే, దిగే ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని వారు గమనించని బ్యాగులను తీసుకుని పారిపోయేవాళ్లు. అయితే, వాళ్లు కేవలం నలుపు, నీలం రంగు బ్యాగులను కొట్టేసేవారు. ఎందుకంటే ఇవి సాధారణంగా జనసమూహంలో తక్కువగా కనిపిస్తాయి. నిందితులు CCTV నిఘా నుంచి ఈజీగా తప్పించుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఈ బ్యాగులను మాత్రమే దొంగతనం చేస్తారని పోలీసులు వెల్లడించారు. అంతేకాదు, స్టేషన్ సమీపంలోని హోటల్లో బస చేస్తారు. దొంగించబడిన బ్యాగులను హోటల్ కు తీసుకెళ్లి అందులోని వస్తువులను తీసుకుని, ఖాళీ బ్యాగులను తెచ్చి రైల్వే స్టేషన్లలోనే వదిలేస్తారని పోలీసులు తెలిపారు. దొంగిలించబడిన వస్తువులను దాచడానికి ఈ దొంగలు బాదర్ పూర్- ఫరీదాబాద్ సరిహద్దుకు సమీపంలో ఉన్న సేఫ్ హౌస్ లను కూడా ఉపయోగించారన్నారు. తరచుగా ఫోన్లు, సిమ్ కార్డులను మార్చడంతో పాటు మారుపేర్లను ఉపయోగించినట్లు వెల్లడించారు.
Read Also: కూతురిపై తండ్రి అఘాయిత్యం.. రైల్లో ప్రసవం.. టాయిలెట్ లో బిడ్డ!