Trains LHB Coaches: ప్రయాణీకులకు భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందించేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ఆహ్లాదకర ప్రయాణ అనుభూతిని కల్పించడంతో పాటు మెరుగైన భద్రత కోసం లింక్ హాఫ్ మన్ బుష్ (LHB) బోగీలను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఇప్పటికే పలు రైళ్లలో వీటిని అందుబాటులోకి తీసుకురాగా, ఇకపై మరిన్ని రైళ్లకు యాడ్ చేయబోతున్నది. ఈ కోచ్ ల వల్ల శబ్దంతో పాటు కుదుపులు తక్కువగా ఉంటాయి. వీటిలో ప్రయాణించేందుకు ప్యాసింజర్లు మొగ్గు చూపుతున్నారు. జర్మన్ సాంకేతికతతో ఈ కోచ్ లు తయారయ్యాయి. ముందుగా వీటిని ఢిల్లీ-లక్నో మధ్య నడిచే శతాబ్ది ఎక్స్ ప్రెస్ కోసం ఇంపోర్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత టెక్నాలజీ సాకారంతో భారతీయ ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలోనూ వీటిని రూపొందిస్తున్నారు. గత ఏడాది వరకు సుమారు 50 వేల LHB బోగీలను తయారు చేశారు. వీటిలో 50 శాతం వరకు ఆయా రైళ్లకు అందుబాటులోకి తెచ్చారు. మరో ఐదు ఏండ్లలో అన్ని రైళ్లకు LHB కోచ్ లను ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ భావిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోని పలు రైళ్లకు LHB కోచ్ లు
తెలుగు రాష్ట్రాల్లో నడుతున్న పలు రైళ్లకు LHB కోచ్ లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నది రైల్వేశాఖ. ఇందులో భాగంగా శబరి, పద్మావతి ఎక్స్ ప్రెస్ రైళ్లకు, తిరుపతి-సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ రైలుకు ఈ బోగీలను జత చేయనుంది. రైల్వే ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చే ప్రక్రియలో భాగంగా శబరి ఎక్స్ ప్రెస్ (17229/17230) రైళ్లు, పద్మావతి ఎక్స్ ప్రెస్ (12763/12764) రైళ్లు, తిరుపతి-సికింద్రాబాద్-తిరుపతి సూపర్ ఫాస్ట్ (12731/12732) రైళ్లకు చాలా కాలంగా LHB కోచ్ లు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉన్నది. తాజాగా రైల్వేశాఖ ఇందుకు ఓకే చెప్పింది. ఈ నేపథ్యంలో ఐసీఎఫ్ కోచ్ ల స్థానంలో ఏప్రిల్ నుంచి LHB కోచ్ లు అందుబాటులోకి రానున్నాయి. వీటితో పాటు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో నడుస్తున్న పలు రెగ్యులర్, స్పెషల్ రైళ్లకు LHB కోచ్ లను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
Read Also: కోడికి టికెట్ తియ్యాలి, ఐస్ క్రీమ్ తినకూడదు.. ఈ ఫన్నీ రైల్ రూల్స్ తెలుసా?
అధిక భద్రత, ఆహ్లాకర ప్రయాణం
LHB కోచ్ లు ప్రయాణీకుల భద్రత, సౌకర్యం, ప్రయాణ అనుభవాన్ని మరింత మెరుగుపరచనున్నాయి. యాంటీ టెలిస్కోప్ సాంకేతికతతో పాటు లేటెస్ట్ డిస్క్ బ్రేక్ తో రూపొందాయి. రైలు పట్టాలు తప్పినప్పుడు బోగీలు బోల్తా పడకుండా ఉంటాయి. యాంటీ క్లైంబింగ్ టెక్నాలజీతో లాక్ సెంటర్ బఫర్ కప్లర్ ను కలిగి ఉండటం వల్ల ప్రమాద సమయంలో బోగీలు ఒకదాని మీదికి మరొకటి ఎక్కవు. దీనివల్ల సహాయక చర్యలు ఈజీ అవుతాయి. ఈ రేక్ లను ఏకంగా గంటలకు 200 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించారు. ఈ కోచ్ లు అన్ని ఫైర్ అసిస్టెన్స్ ను కలిగి ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అగ్ని ప్రమాదాలు జరగకుండా కాపాడుతాయి. ఈ బోగీలు కుదుపులు లేని ప్రయాణాన్ని అందిస్తాయి. శబ్దం కూడా చాలా తక్కువగా వస్తుంది.
Read Also: మహాకుంభమేళాకు వెళ్లే భక్తులకు గుడ్న్యూస్.. అందుబాటులోకి స్పెషల్ వందే భారత్!