Indian Railways: భారతీయ రైల్వే సంస్థలో బోలెడు రైళ్లున్నాయి. ఇప్పుడంటే వందేభారత్ రైళ్లు అత్యంత వేగంతో పాటు అత్యాధునిక వసతులతో ఆహ్లాదకర ప్రయాణాన్ని అందిస్తున్నాయి. వందేభారత్ ఎంట్రీకి ముందు శతాబ్ది, రాజధాని, దురంతో ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రీమియం రైళ్లుగా భావించే వాళ్లు. ఉన్న రైళ్లలో ఇవే అత్యంత వేగంతో పాటు చక్కటి వసతులను కలిగి ఉండేవి. ఈ రైళ్లు 10 నుంచి 12 గంటల్లో 1,000 కిలో మీటర్లకు పైగా ప్రయాణించేవి. ఈ రైళ్లకు మించి మరో సూపర్ లగ్జరీ రైలును అందుబాటులోకి తెచ్చింది భారతీయ రైల్వే సంస్థ. అద్భుతమైన సౌకర్యాలతో పాటు అత్యంత వేగంగా ప్రయాణించే తేజస్ సూపర్ లగ్జరీ రైలును ప్రారంభించింది. ఇంతకీ ఈ రైలు ప్రత్యేక ఏంటో తెలుసా?
భారతీయ రైల్వేలో తేజస్ రైలుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రైలు సౌకర్యాల పరంగా రాజధాని, శతాబ్ది రైళ్లను తలదన్నేలా ఉంటుంది. తేజస్ ఎక్స్ ప్రెస్ని ఇతర సూపర్ ఫాస్ట్ రైళ్ల కంటే వేగంగా ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతుంది. దేశంలోని పలు ప్రాంతాల్లో నడుస్తున్న తేజస్ రైలు ప్రయాణీకులకు ఇష్టమైన రైళ్లలో ఒకటిగా కొనసాగుతోంది. ప్రయాణీకులకు అందించే ఫుడ్ నుంచి సౌకర్యవంతమైన సీటింగ్ వరకు ఈ సూపర్ లగ్జరీ రైలు రూటే సఫరేటుగా చెప్పుకోవచ్చు.
విమానం తరహా సౌకర్యాలు
తేజస్ రైలు విమానాలలో మాదిరిగా సౌకర్యాలను అందిస్తుంది. ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి విమానాల్లో ఎయిర్ హోస్టెస్ ను కలిగి ఉన్నట్లే, తేజస్ రైలులో ట్రైన్ హోస్టెస్ ఉంటారు. వీళ్లకు కూడా ప్రత్యేకమైన యూని ఫారమ్ ఉంటుంది. జర్నీలో ప్రయాణీకులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తుంటారు. అంతేకాదు, రైలుకు సంబంధించి సమాచారాన్ని కూడా ప్రయాణీకులకు వివరిస్తారు. ప్రతి స్టేషన్ లో రైల్లోకి ఎక్కే ప్రయాణీకును వీళ్లు సాదరంగా స్వాగతం పలుకుతారు. తేజస్ లోని ఫుడ్ సర్వీసులు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. మరే ఇతర రైళ్లలో లేని విధంగా విలాసవంతమైన ఆహారాన్ని అందిస్తారు.
Read Also: రైలు ప్రయాణం చేస్తున్నారా? పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే ఇబ్బందులు తప్పవు!
గంటకు 140 కిలో మీటర్ల వేగంతో ప్రయాణం
తేజస్ సూపర్ లగ్జరీ రైలు గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సత్తాను కలిగి ఉంటుంది. కానీ, అధికారులు ఈ రైలు వేగాన్ని గంటకు 140 కి.మీకి తగ్గించారు. రాజధాని, శతాబ్ది, దురంతో వంటి రైళ్లు గరిష్టంగా 150 నుండి 160 కి.మీ వేగాన్ని అందుకుంటాయి. కానీ, ఆపరేషనల్ స్పీడ్ గంటకు 130 నుంచి 140 కిలో మీటర్ల మధ్యలో ఉంటుంది. తేజస్ ఎక్స్ ప్రెస్ తేజస్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో మరో ప్రత్యేకత ఆటోమేటిక్ గేట్లు. ఇవి రైలు ఆగిన స్టేషన్లలో మాత్రమే ఓపెన్ అవుతాయి. ఈ స్పెషల్ ఫీచర్ ప్రస్తుతం మరే ఇతర రైళ్లలో లేదు. చాలా వరకు రైల్వే ప్రయాణీకులు తేజస్ లో జర్నీ చేసేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతారు.
Read Also: రైలు బోగీల్లో రెడ్ విండోస్.. వీటి వెనుక ఇంత పెద్ద కథ ఉందా?