India’s High-Risk Railway Corridors: ఇండియన్ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద నెట్ వర్క్ లలో ఒకటిగా కొనసాగుతోంది. ప్రతి రోజు కోట్లాది మంది ప్రయాణికులు రైళ్ల మీద ఆధారపడుతున్నారు. అయితే, దేశంలో కొన్ని రైల్వే మార్గాల్లో ప్రమాదాల ముప్పు చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఎక్కువ రద్దీ ఉన్న మార్గాల్లో ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. ఇంతకీ భారతీయ రైల్వేలో అత్యంత ప్రమాదకరమైన రూట్లు ఏవనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల మీదుగా వెళ్లే ఇండో-గంగా మైదాన ప్రాంత రైల్వే కారిడార్లు ప్రమాదాలకు ఎక్కువగా గురవుతున్నాయి. ఢిల్లీ–కాన్పూర్–ప్రయాగ్రాజ్ (అలహాబాద్), గయా–మొఘల్ సరాయ్ లాంటి ప్రధాన మార్గాల్లో ఎక్కువ ప్రమాదాలు జరిగే రూట్లుగా గుర్తించారు. ఈ మార్గాల్లో ప్రతి రోజూ ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్, సరుకు రవాణా రైళ్లు భారీ సంఖ్యలో నడుస్తుంటాయి. ట్రాక్ ల సామర్థ్యానికి మించి రైళ్లు నడవడం వల్ల సిగ్నళ్ల దగ్గర ఎక్కువసేపు నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా ట్రాఫిక్ పెరగడంతో పాటు హ్యూమన్ ఎర్రర్స్ కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో రైళ్లు ఢీకొనడం, పట్టాలు తప్పడం లాంటి ప్రమాదాలకు కారణమవుతోంది.
ఉత్తర తూర్పు భారత్ లోని నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (NFR) పరిధిలో కూడా కొన్ని ప్రాంతాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. కొండ ప్రాంతాలు, భారీ వర్షాలు సహా ప్రకృతి పరిస్థితులు అక్కడి రైలు రాకపోకలపై ప్రభావం చూపుతుంటాయి. అయితే, దేశవ్యాప్తంగా పెద్ద రైలు ప్రమాదాలు ఎక్కువ ప్రాణనష్టానికి కారణమని భావించడం సరైనది కాదని నిపుణులు చెప్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం, రైల్వే సంబంధిత మరణాల్లో అత్యధిక శాతం కదులుతున్న రైళ్ల నుంచి జారిపడడం, అనుమతి లేని చోట్ల పట్టాలు దాటే సమయంలో జరిగే ప్రమాదాలతోనే జరుగుతున్నాయి. మొత్తం రైల్వే మరణాల్లో 70 శాతానికి పైగా ఇలాంటి ఘటనల వల్లే నమోదవుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే.. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రైల్వే సంబంధిత మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో జనాభా అధికంగా ఉండటం, రైళ్ల వినియోగం ఎక్కువగా ఉండటం, అనధికారికంగా ట్రాక్లు దాటడం లాంటి కారణాలు ప్రమాదాలకు కారణం అవుతున్నాయి.
రైల్వే శాఖ గత కొన్నేళ్లుగా ట్రాక్ల ఆధునికీకరణ, ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థలు, కవచ్ లాంటి సాంకేతికతను వినియోగిస్తోంది. ప్రమాదాలను తగ్గించే ప్రయత్నాలు చేస్తోంది. ప్రయాణికులు కూడా రైలు ప్రయాణ సమయంలో భద్రతా నిబంధనలు పాటించడం, రన్నింగ్ రైలు ఎక్కడం, దిగడం మానుకోవడం, అనధికారికంగా పట్టాలు దాటకుండా ఉండటం ద్వారా ప్రమాదాలను తగ్గించే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు.
Read Also: మళ్లీ సరిహద్దులు దాటనున్న రైళ్లు.. త్వరలో భారత్-బంగ్లాదేశ్ సర్వీసులు ప్రారంభం!