Vande Bharat Route Change: రైల్వే ట్రాక్ డబ్లింగ్ పనుల కారణంగా భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పనుల కారణంగా రెండు రోజుల పాటు వందేభారత్ సహా 12 రైళ్లను రూట్ మార్చడంతో పాటు అలస్యంగా నడపనున్నట్లు ప్రకటించింది. బీహార్లో జరుగుతున్న ట్రాక్ డబ్లింగ్ పనుల కారణంగా ఈశాన్య రైల్వే (NER) పలు రైళ్ల సర్వీసుల్లో తాత్కాలిక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. జూలై 2, 3 తేదీల్లో మొత్తం 12 రైళ్లను దారి మళ్లించడంతో పాటు కొన్ని రైళ్ల బయలుదేరే సమయాలను కూడా మార్చింది. ఈ మార్పుల ప్రభావం గోరఖ్ పూర్–పాట్లీపుత్ర వందే భారత్ ఎక్స్ ప్రెస్ పైనా పడింది.
తూర్పు మధ్య రైల్వే పరిధిలోని సమస్తిపూర్ డివిజన్లో బెట్టియా, మఝౌలియా స్టేషన్ల మధ్య ట్రాక్ డబ్లింగ్ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనులను పూర్తి చేసేందుకు నాన్ ఇంటర్ లాకింగ్ ప్రక్రియ చేపట్టడంతో రైళ్ల రాకపోకల్లో తాత్కాలిక మార్పులు అవసరమయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గించేలా ప్రత్యామ్నాయ మార్గాల్లో రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించారు.
జూలై 2న బయలుదేరాల్సిన 14009 బాపుధామ్ మోతిహారి–ఆనంద్ విహార్ టెర్మినల్ ఎక్స్ ప్రెస్ ను బాపుధామ్ మోతిహారి నుంచి కాకుండా నర్కటి యాగంజ్ నుంచి ప్రయాణాన్ని ప్రారంభిస్తుందన్నారు. అదే రోజు కొన్ని ముఖ్యమైన రైళ్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో నడుస్తాయని చెప్పారు. వీటిలో 15052 గోరఖ్పూర్–కోల్కతా ఎక్స్ప్రెస్, 15705 కతిహార్–ఢిల్లీ ఎక్స్ ప్రెస్, 04623 కోల్కతా–అమృతసర్ స్పెషల్, 15211 దర్భంగా–అమృతసర్ ఎక్స్ ప్రెస్, 12558 ఆనంద్ విహార్–ముజఫర్ పూర్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఉన్నాయి. ఇవి నర్కటియాగంజ్, సిక్తా, రక్సౌల్, సీతామర్హి, ముజఫర్ పూర్ మార్గాల మీదుగా నడుస్తాయి.
జూలై 3న కూడా పలు రైళ్ల మార్గాల్లో మార్పులు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా 26502 గోరఖ్ పూర్–పాట్లీపుత్ర వందే భారత్ ఎక్స్ ప్రెస్ నర్కటియాగంజ్, సిక్తా, రక్సౌల్, సగౌలి మీదుగా ప్రయాణిస్తుంది. అటు 15567 బాపుధామ్ మోతిహారి–ఆనంద్ విహార్ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్, 15273 రక్సౌల్–ఆనంద్ విహార్ ఎక్స్ ప్రెస్, 19038 బరౌని–బాంద్రా టెర్మినస్ ఎక్స్ ప్రెస్ ను కూడా దారి మళ్లించారు. అటు రెండు రైళ్లు బయలుదేరే సమయాలను కూడా రైల్వే మార్చింది. 12211 ముజఫర్పూర్–ఆనంద్ విహార్ టెర్మినల్ ఎక్స్ ప్రెస్ ముజఫర్ పూర్ నుంచి రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది. అటు 12557 ముజఫర్ పూర్–ఆనంద్ విహార్ టెర్మినల్ ఎక్స్ ప్రెస్ మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమవుతుంది.
ట్రాక్ డబ్లింగ్ పనులు పూర్తయిన తర్వాత ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు మరింత సులభంగా సాగడంతో పాటు భద్రత, వేగం కూడా మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో జూలై 2, 3 తేదీల్లో ప్రయాణించే వారు తమ రైలు టైమ్, రూట్ గురించి ముందుగానే తెలుసుకోవాలని సూచించారు.
Read Also: ఒక్క టికెట్ తో అయోధ్య, కాశీ, పూరీ దర్శనం.. IRCTC బంపర్ ఆఫర్!