Adinarayana Reddy: తిరుపతి వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిలపై బీజేపీ ఎమ్మెల్యే సి.ఆదినారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తోందని చెబుతూ.. గత వైసీపీ ప్రభుత్వంపై, ఆ పార్టీ నేతల వైఖరిపై ఆయన చేసిన హాట్ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
స్టీల్ ప్లాంట్ వివాదం – అవినాష్పై విమర్శలు
కడప స్టీల్ ప్లాంట్ విషయంలో వైఎస్ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయని ఆదినారాయణ రెడ్డి మండిపడ్డారు. అసలు అవినాష్ రెడ్డికి కనీస జ్ఞానం ఉందా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల అధికార కాలంలో కడప స్టీల్ ప్లాంట్ పేరుతో రెండుసార్లు శంకుస్థాపనలు చేసి ప్రజలను మోసం చేశారే తప్ప, అక్కడ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని విమర్శించారు.
జగన్, అవినాష్లపై తీవ్ర ఆరోపణలు
వైఎస్ జగన్, అవినాష్ రెడ్డి ఇద్దరూ పెద్ద చోరులని, ఈ అన్నదమ్ములు కలిసి రాష్ట్రాన్ని పూర్తిగా నాశనం చేశారని ఆదినారాయణ రెడ్డి ధ్వజమెత్తారు. ‘సాక్షి’ పేపర్, టీవీల వల్ల గతంలో చాలా మంది అధికారులు, నేతలు జైలుకు వెళ్లాల్సి వచ్చిందని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు కాబట్టే ఇప్పుడు అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
Also Read: గచ్చిబౌలి IIITలో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి ఖమ్మం విద్యార్థి ఆత్మహత్య
వివేకా హత్య కేసు ప్రస్తావన
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావిస్తూ ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డి స్వయంగా దగ్గరుండి వివేకాను చంపించారని, ఈ కేసులో ఆయన ‘A08’ అని పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో ఎప్పటికైనా వైఎస్ జగన్, అవినాష్ రెడ్డిలే ప్రధాన ముద్దాయిలుగా నిలుస్తారని ఆయన స్పష్టం చేశారు.
కూటమి పాలన – అభివృద్ధి పథం
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ (కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు) అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఎమ్మెల్యే వివరించారు. రాయలసీమ ప్రాంతానికి బుల్లెట్ ట్రైన్ తీసుకురాబోతున్నామని, రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో సీ పోర్టులు, విమానాశ్రయాలను నిర్మిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ ఏపీలో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, పోలవరం ప్రాజెక్టును కూడా బీజేపీ ప్రభుత్వమే పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు.
వైసీపీకి భవిష్యత్తు లేదు
వైసీపీ హయాంలో కనీసం రోడ్లు వేయడం కూడా చేతకాలేదని, అలాంటిది అమరావతికి తామే పోటీ అంటుండటం హాస్యాస్పదమని ఆదినారాయణ రెడ్డి అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడిస్తామని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి కనీసం 11 సీట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు.