AP Cabinet: ఆంధ్రప్రదేశ్ రాజకీయ, పాలనా వర్గాల్లో ఈరోజు అత్యంత కీలకమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అమరావతి వేదికగా ఒకవైపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం, మరొకవైపు అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు, బడ్జెట్ ప్రసంగాల వేళ విస్తృత చర్చలకు సిద్ధమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, పట్టణ స్థానిక సంస్థల నాయకుల ఎంపిక విధానం, సంక్షేమం నుంచి రవాణా భద్రత వరకు పలు కీలక అంశాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
ముఖ్యమైన నిర్ణయాలతో క్యాబినెట్ భేటీ
ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ఆర్డినెన్స్ లేదా చట్ట సవరణ ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీంతో పాటు మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక విధానంలో తీసుకురానున్న మార్పుల కోసం మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు కూడా ఆమోదం తెలుపనున్నారు. స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఇటీవల తీసుకున్న కీలక పెట్టుబడి ప్రతిపాదనలకు కూడా ఈ సమావేశంలో ఆమోదం తెలుపనున్నారు.
అసెంబ్లీలో ప్రజా సమస్యలపై కీలక చర్చలు
శాసనసభ రెండో రోజు సమావేశాల్లో భాగంగా ‘సూపర్ సిక్స్.. ప్రజా సంక్షేమం’ అంశంపై లఘు చర్చ జరగనుంది. విద్యారంగానికి సంబంధించి పబ్లిక్ లైబ్రరీస్ చట్ట సవరణ బిల్లును మంత్రి నారా లోకేశ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 నియామకాల్లో జరిగాయని ఆరోపిస్తున్న అక్రమాలపై సభలో ప్రత్యేకంగా ప్రస్తావనకు రానుంది. దీనితో పాటు వడ్డీలేని రుణాల పరిమితి పెంపు, గ్రామ పంచాయతీల ఉన్నతీకరణ, విశాఖపట్నంలో పెరుగుతున్న వాయు కాలుష్యం, కాఫీ రైతులకు నష్టపరిహారం, కొత్త పోర్టులు , ఫిషింగ్ హార్బర్ల పురోగతిపై ప్రజాప్రతినిధులు ప్రభుత్వం నుండి సమాధానాలు కోరనున్నారు.
శాసనమండలిలో బిల్లులు, ప్రశ్నోత్తరాలు
మరోవైపు శాసనమండలిలో మున్సిపల్ చట్టాల సవరణ బిల్లును మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు. పాఠశాలల మూసివేత, వాణిజ్య పన్నుల బకాయిలు, రాష్ట్రంలో కరువు మండలాల ప్రకటన, నేతన్నలకు సంబంధించిన పథకాలపై సభ్యులు వేసే ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. అలాగే విద్యుత్ రంగానికి చెందిన పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లు, వక్ఫ్ భూముల కేటాయింపు, జీవో 3 పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ వంటి అంశాలపై మండలి వేదికగా విస్తృత చర్చ జరగనుంది.
రాష్ట్ర భవిష్యత్తుకు , రాబోయే స్థానిక ఎన్నికలకు సంబంధించి ఇటు క్యాబినెట్ నిర్ణయాలు, అటు చట్టసభల చర్చలు ఎంతగానో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Also Read: బాన్సువాడలో బిగ్ ట్విస్ట్.. KCR వద్ద పోచారం పశ్చాత్తాపం.. BRS లైన్ క్లియర్ చేసిందా?