AP Assembly: అమరావతి సాక్షిగా ఏపీ రాజకీయాలు మరోసారి తీవ్ర ఊపందుకున్నాయి. రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఇవాళ అత్యంత ప్రాధాన్యత నడుమ ప్రారంభమతున్నాయి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు మొదలుకానున్నాయి. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించి, సభను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే దానిపై స్పష్టత రానుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ సమావేశాలు నాలుగు రోజుల పాటు సాగే అవకాశముంది.
తొలి రోజు అజెండా- డీఎస్సీ 2025, రైతాంగ సమస్యలు
మొదటి రోజు అసెంబ్లీ ప్రశ్నోత్తరాలతో షురూ కానుంది. నిరుద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డీఎస్సీ 2025 పై ప్రభుత్వం ఈరోజు సభలో ప్రత్యేకంగా చర్చించనుంది. దీనితో పాటు ఎల్ నినో ప్రభావం, పంటలకు నీటి ಲభ్యత, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతాంగానికి ధైర్యం ఇచ్చేలా కీలక చర్చలు జరగనున్నాయి.
రెండో రోజు- బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు
రెండో రోజు సభలో బిసి సంక్షేమంపై కీలక అడుగు పడనుంది. బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. అనంతరం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్ శాఖల్లో బీసీలకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను పెంచేందుకు సంబంధించి ఒక కీలక బిల్లును ప్రవేశపెట్టనున్నారు.
మూడో రోజు- గ్రూప్-1 అక్రమాలు, శాంతిభద్రతలు
మూడో రోజు అసెంబ్లీలో తీవ్ర రాజకీయం వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 నియామకాలు, ఫలితాల్లో చోటుచేసుకున్నాయన్న అక్రమాలపై ప్రభుత్వం చర్చ చేపట్టనుంది. దీనితో పాటు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై కూడా సమగ్రంగా చర్చించనున్నారు.
నాలుగో రోజు- పెట్టుబడులు, సూపర్ సిక్స్ పథకాలు
ఆఖరి రోజున కూటమి ప్రభుత్వం తన ప్రాధాన్యతలను సభ ముందు ఉంచనుంది. రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమల పురోగతితో పాటు ప్రతిష్టాత్మక ‘సూపర్ సిక్స్’ పథకాల అమలు తీరుపై సుదీర్ఘ చర్చ జరగనుంది. వీటికి తోడు అనేక ఇతర కీలక బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టి ఆమోదించే దిశగా ప్రభుత్వం సిద్ధమైంది.
Also Read: బాబోయ్.. ఆ ముగ్గురు మంత్రులను తట్టుకోలేం.. వాపోతున్న అధికారులు!