TTD : పైపైన చూస్తే మామూలుగానే కనిపిస్తాయి.. లోలోన తరచి చూస్తే అసలు విషయం బయటపడుతుంది. సమ్మర్ హాలిడేస్తో కొద్ది రోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు, వెలుపల క్యూ లైన్లు అన్నీ భక్తులతో నిండిపోతున్నాయి. రద్దీకి అనుగుణంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేసింది TTD. అయితే శుక్రవారం రాత్రి సర్వదర్శనం క్యూ లైన్లో ఓ భక్తుడు హంగామా చేశాడు. కట్ చేస్తే, అతను వైసీపీకి చెందిన కీలక నాయకుడు అని తెలిసింది. తిరుమల ఆలయంపై కుట్ర చేస్తున్నారంటూ సీఎం చంద్రబాబు సైతం స్పందించాల్సి వచ్చింది.
అసలేం జరిగిందంటే..
తిరుమల సర్వదర్శనం క్యూలైన్లో ఉన్నట్టుండి ఓ భక్తులు పెద్ద పెద్దగా అరుస్తూ నినాదాలు చేశాడు. TTD యాజమాన్యం డౌన్ డౌన్ అంటూ నిరసన తెలిపాడు. క్యూలైన్లో పాలు, నీళ్లు లేవంటూ గోల చేశాడు. అతని చేష్టలతో క్యూ లైన్లో కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఆ వీడియో బయటకు రావడంతో వైసీపీ శ్రేణులు అది తెగ వైరల్ చేస్తున్నారు. నిజానికి దర్శన క్యూలైన్ల దగ్గర ప్రతి 100 అడుగులకు.. శ్రీవారి సేవకులచే భక్తులకు నిర్విరామంగా తాగునీళ్లు, పాలు, అన్నప్రసాదాలను TTD పంపిణీ చేస్తోంది.
తిట్టి.. సారీ చెప్పి..
అయితే, ఇందులో మరో ట్విస్ట్. క్యూ లైన్లో గోల చేసిన భక్తుడే.. కాసేపటి తర్వాత స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చాక తన తప్పును ఒప్పుకున్నాడు. TTDకి క్షమాపణ చెప్పాడు. తన పేరు అచ్చారావు అని.. తనకు ఆరోగ్యం బాగోలేదని.. ఇలా నిరసన చేస్తే త్వరగా దర్శనానికి అనుమతి ఇస్తారనే ఉద్దేశంతోనే TTDకి వ్యతిరేకంగా నినాదాలు చేశానని చెప్పాడు. దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలియక ఉద్రేకంతో విచక్షణ కోల్పోయి TTD పెద్దలను తప్పుబడుతూ నినాదాలు చేసి పొరపాటు చేసానని.. TTD చైర్మన్, అధికారులకు క్షమాపణ చెప్పాడు. ఆ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీటీడీపై వైసీపీ కుట్ర..?
గత కొద్ది రోజులుగా TTDని టార్గెట్ చేసుకొని కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని TTD భావిస్తోంది. తాజాగా భక్తుడి నిరసన వీడియోను.. తిరుమలలో భక్తులు నానా అవస్థలు పడుతున్నారంటూ ఓ రాజకీయ పార్టీకి సంబందించిన సోషల్ మీడియా వేదికలో వీడియో పోస్ట్ చేశారు. ఈ విధంగా భక్తుల్లో ఆందోళన కలిగించే అవాస్తవాలు, అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని TTD హెచ్చరిస్తోంది. క్యూలైన్లో భక్తుడి హైడ్రామా దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వ్యక్తి కోసం TTD విజిలెన్స్, పోలీసు సిబ్బంది గాలింపు చేపట్టారు. ఇక, గొడవ చేసిన అచ్చారావు వైసీపీ పార్టీకి చెందిన నాయకుడని టీడీపీ గుర్తించింది. ఇదంతా కుట్ర పూరితంగా జరుగుతోందని భావిస్తోంది.
చంద్రబాబు వార్నింగ్
టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తిరుమలలో అరాచకాలు సృష్టిస్తూ.. అక్కడ ఏదో జరుగుతోందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. డేగ కన్నుతో అన్నీ గమనిస్తున్నానని చెప్పారు. తోక తిప్పితే.. కట్ అయిపోతుందని వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి.
Also Read : వల్లభనేని వంశీ చాప్టర్ క్లోజ్!.. భార్య ఎంట్రీ?