CM Chandrababu: కూటమి గెలిస్తే ఏమీ చేయలేరంటూ కొంతమంది అబద్ధపు ప్రచారాలు సాగించారని, ప్రస్తుతం రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుంటే వారు ఓర్వలేకపోతున్నట్లు సీఎం చంద్రబాబు అన్నారు. అలాగే రాష్ట్ర ప్రజలు టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించారని, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏమైనా చేయగలరని నిరూపించారన్నారు. తాను కష్టపడేది కేవలం ఐదు కోట్ల ప్రజల కోసమే నన్న చంద్రబాబు, సీఎం హోదాలో తాను సాదాసీదాగా వచ్చానన్నారు.
తాను పర్యటనలకు వచ్చినా, పరదాలు కట్టలేదన్నారు. కాఫీ పెట్టడం పెద్ద కష్టం కాదని ఆడవాళ్లు ఉద్యోగం చేసి వస్తే భర్త కాఫీ పెడితే ఇద్దరూ తాగొచ్చు కదా అంటూ చంద్రబాబు అనగానే, సభలో నవ్వులు విరౠశాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 90 లక్షల టీడీపీ సభ్యత్వాలు పూర్తయ్యాయని, పార్టీని నమ్ముకున్న వారిని తాము వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
పల్నాడు జిల్లా యల్లమందలో సీఎం చంద్రబాబు మంగళవారం పర్యటించారు. ఇంటింటికీ పింఛన్ల పంపిణీలో కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులతో చంద్రబాబు మాట్లాడారు. తొలుత శారమ్మ ఇంటికి వెళ్లి పింఛన్ అందజేశారు. శారమ్మ కుటుంబం కష్టాలు అడిగి తెలుసుకున్న సీఎం, ఆమె కుమారుడికి లోన్ ఇప్పించాలని అధికారులకు సూచించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.లక్ష లోన్ ఇప్పించాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. శారమ్మ కుమార్తెకు మంచి చదువు చెప్పించాలన్నారు. డాక్టర్ అయ్యేందుకు నీట్ కోచింగ్ ఇప్పించాలని కూడా సీఎం తెలిపారు.
అలాగే గ్రామంలో గల మరో పింఛన్ లబ్ధిదారు ఏడుకొండలు ఇంటికి సీఎం వెళ్లారు. ఏడుకొండలు ఇంట్లో స్వయంగా కాఫీ తయారుచేశారు సీఎం. కాఫీ చేసి ఏడుకొండలు కుటుంబసభ్యులకు అందించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్వయం ఉపాధి నిమిత్తం దుకాణం పెట్టుకునేందుకు రూ.5లక్షలు లోన్ మంజూరుకు సీఎం హామీ ఇచ్చారు. అది కూడా బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.5లక్షలు ఇప్పించాలని, ఇంటి నిర్మాణం పూర్తి చేసుకునేందుకు రుణం మంజూరుకు కూడా సీఎం ఆదేశాలిచ్చారు.
ఒక సీఎం హోదాలో ఉండి, ప్రతినెలా పింఛన్ పంపిణీకి చంద్రబాబు రావడంపై పింఛన్ దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమ ఇంటికి వచ్చిన సీఎం, సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు లబ్దిదారులు. నూతన ఏడాదికి ముందు తమ గృహాలకు సీఎం రావడంతో పింఛన్ పంపిణీ కంటే, ముందే సంక్రాంతి వచ్చిందన్నారు. సీఎం రాక సంధర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు అక్కడికి తరలివచ్చారు.
Also Read: Kasturi Shankar: పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్.. ఈ మాటలు ఎక్స్పెక్ట్ చేయలేదుగా..?
వారితో కూడా సీఎం మాట్లాడి, రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బాబు గారూ.. మీరు మారారు. మీ పలకరింపు, ఆత్మీయత, వరాల జల్లు ఇదేనయ్యా, బాబు గారి నైజం అంటున్నారు టీడీపీ శ్రేణులు. సీఎం హోదాలో పింఛన్ దారుని ఇంటికి వెళ్లడం ఒక విశేషమైతే, వారి కష్టాలు తెలుసుకొని వరాలు కురిపించడం మరో విశేషం. అంతేకాదు స్వయంగా కాఫీ తయారు చేసి లబ్దిదారులకు అందజేయడంతో టీడీపీ శ్రేణుల ఆనందానికి అవధుల్లేవు.