Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసభ్య ప్రచారాలు, వ్యక్తిత్వ హననం (క్యారెక్టర్ అస్సాసినేషన్) పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భావప్రకటన స్వేచ్ఛ అనేది ఇతరులను దూషించడానికి ఇచ్చిన లైసెన్స్ కాదని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను దుర్వినియోగం చేస్తూ సమాజంలో విద్వేషాలు రేకెత్తించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఏపీ ప్రభుత్వం తరఫున గట్టి హెచ్చరిక జారీ చేశారు.
వాక్ స్వాతంత్ర్యం – పరిమితులు
రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం పూర్తిగా గౌరవిస్తుందని, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు అందరికీ ఉందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే, ఆర్టికల్ 19(2) ప్రకారం వాక్ స్వాతంత్ర్యానికి కొన్ని పరిమితులు ఉన్నాయని గుర్తుచేశారు. నకిలీ ఖాతాల వెనుక దాక్కుని బూతులు మాట్లాడటం, మహిళలను లక్ష్యంగా చేసుకోవడం, మతపరమైన నమ్మకాలను దెబ్బతీయడం నేరమని స్పష్టం చేశారు.
Also Read: కేటీఆర్ ఖాళీగా ఉన్నారు.. అందుకే చర్చలకు పిలుస్తున్నారు: జగ్గారెడ్డి
కులం, మతం వెనుక దాక్కోవద్దు
తప్పు చేసిన వారికి ఎలాంటి కులం, మతం, రాజకీయ పార్టీల ముసుగులు ఉండవని డిప్యూటీ సీఎం తేల్చి చెప్పారు. నేరం చేసినప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోతుందని, శిక్ష నుంచి తప్పించుకోవడానికి కులప్రాంతాల కార్డులను వాడుకోవద్దని హెచ్చరించారు.
ప్రత్యేక యంత్రాంగం, టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
సోషల్ మీడియా వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక ‘ప్రత్యేక యంత్రాంగం’ (Dedicated Mechanism) ఏర్పాటయింది. బాధితులు తమకు ఎదురైన వేధింపుల స్క్రీన్షాట్లు, వీడియో లింకులను ఇక్కడ సమర్పించవచ్చు. అలాగే సైబర్ నేరస్థులను ఏరిపారేయడానికి సైబర్ క్రైమ్ పోలీసులతో కలిసి ‘ప్రత్యేక టాస్క్ ఫోర్స్’ను రంగంలోకి దించుతున్నారు.
Also Read: బెంగాల్లో ఉద్రిక్తత.. ఎంపీ మహువా మోయిత్రాపై కోడిగుడ్లతో దాడి!
కఠిన చట్టాల ప్రయోగం
కొత్త చట్టాలైన BNS, BNSS లతో పాటు ఐటీ యాక్ట్-2000 కింద కేసుల నమోదు ఉంటుంది. తప్పుడు పుకార్లు వ్యాప్తి చేస్తే BNS సెక్షన్ 353 కింద, ఐడెంటిటీ థెఫ్ట్ (నకిలీ ఖాతాల క్రియేషన్) పై ఐటీ యాక్ట్ సెక్షన్ 66C, 66D కింద చర్యలు తీసుకుంటారు. ప్రస్తుత చట్టాలు సరిపోకపోతే మరిన్ని కఠిన చట్టాలు తేవడానికి కూడా ప్రభుత్వం వెనకాడదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తూ, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను ఫార్వార్డ్ చేయవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.