Amaravati: వైసీపీ నేతల అమరావతి టూర్ రణరంగంగా మారింది. ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని రైతులు వైసీపీ నేతలపై తిరగబడ్డారు. వైసీపీ నేతల వాహనాలను రైతులు, మహిళలు అడ్డుకొని కోడిగుడ్లు, కర్రలతో దాడికి దిగారు. దాడిలో MLC వాహనం ధ్వంసమైంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన పోలీసులపై సైతం రైతులు ఎటాక్ చేశారు. పలువురు పోలీస్ సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో మరోసారి రాజకీయ సెగలు రేగాయి. భూసేకరణకు వ్యతిరేకంగా పెనుమాక రైతులు కొన్నిరోజులుగా ఉద్యమిస్తున్నారు. వీరికి మద్దతుగా వైసీపీ బృందం, రైతు పరిరక్షణ కమిటీ అమరావతి టూర్ చేపట్టారు. అయితే వైసీపీ నేతల టూర్పై అమరావతికి భూములు ఇచ్చిన ఇతర రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో రాజధాని రైతులు ధర్నాకు దిగారు.
ఉండవల్లి సెంటర్కు చేరుకున్న వైసీపీ నేతలు పేర్ని నాని, దేవినేని అవినాష్, లేళ్ల అప్పరెడ్డిని రైతులు అడ్డుకున్నారు. వైసీపీ గోబ్యాక్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈక్రమంలో వైసీపీ నేతలపై కోడిగుడ్లతో ఎటాక్ చేశారు. తర్వాత వైసీపీ నేతలపై కర్రలతో సైతం దాడి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వైసీపీ నేతలను అక్కడి నుంచి పంపించేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా అంగీకరించిన తర్వాతే ఇక్కడ అడుగు పెట్టాలని రాజధాని ప్రాంత రైతులు డిమాండ్ చేశారు. 85శాతం భూములు ఇచ్చిన రైతుల గురించి కాకుండా 15 శాతం భూములు ఇవ్వని రైతుల కోసం వస్తున్నారా అంటూ రైతులు ధర్నా చేశారు.
Also read: ములుగు జిల్లా రైతులకు గుడ్ న్యూస్.. పాత భూసేకరణ ధరలు రద్దు..!
ప్రభుత్వం అవసరం లేకపోయినా రైతుల నుంచి భూములు లాక్కోవడం దుర్మార్గమన్నారు మాజీమంత్రి పేర్ని నాని. తమపైకి రౌడీ మూకలను ఉసిగొల్పి పంపారని ఆరోపించారు. తాడేపల్లి టీడీపీ మండల అధ్యక్షుడు పూలింగులో భూమి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. తమపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. రైతుల ముసుగులో టీడీపీ గుండాలు దాడులు చేశారని మాజీమంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. జగన్ దగ్గరకు వచ్చారన్న కారణంతో రైతులను వేధించటం దుర్మార్గమని అభిప్రాయపడ్డారు. బాధిత రైతులను కలవడానికి వెళ్తే దాడి చేస్తారా అని ప్రశ్నించారు. మొత్తానికి వైసీపీ నేతల టూర్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నేతలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు వైసీపీ నేతలు.
Storey By: Anup Big Tv
Also read: TTD Darshan: తిరుమలకు వెళ్లే భక్తులకు హై అలర్ట్.. రెండు రోజులు పాటు వీఐపీ దర్శనాలు రద్దు!