Corporation Appointments: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలోని ప్రభుత్వ కార్పొరేషన్లు,సంస్థల చైర్మన్ల నియామకంపై కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది.ఇకపై ప్రభుత్వ ప్రతిపాదనలతో మాత్రమే సరిపెట్టకుండా, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ స్వయంగా స్క్రీనింగ్ నిర్వహించి ఆమోదముద్ర వేయాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ప్రతిపాదించినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లోనూ, నామినేటెడ్ పదవుల ఆశావహుల్లోనూ తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.
వాస్తవానికి ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వం పంపిన పేర్ల జాబితాను ఏఐసీసీ పరిశీలించి కేవలం సాంకేతికంగా క్లియరెన్స్ ఉత్తర్వులు జారీ చేసేది. కానీ,మారుతున్న రాజకీయ సమీకరణాలు, క్షేత్రస్థాయి ఫలితాల ఆధారంగా ఈ విధానంలో మార్పులు తెచ్చినట్లు తెలుస్తోంది. ఇక నుంచి ప్రతిపాదిత నాయకుల వివరాలు, వారి రాజకీయ నేపథ్యం, పార్టీకి చేసిన సేవలు, స్థానిక సమీకరణాలను ఏఐసీసీ ప్రత్యేక బృందం ప్రత్యక్షంగా స్క్రీనింగ్ చేస్తుంది. దీని వలన నామినేటెడ్ పదవుల కేటాయింపులో అగ్రనేతల, సీనియర్ల మితిమీరిన జోక్యాన్ని తగ్గించవచ్చనే ది హైకమాండ్ భావన. ఈ నిర్ణయం పట్ల అన్ని రాష్ట్రాల నాయకులు ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్ లో అంగీకరించినట్లు తెలిసింది.
ఇక నుంచి కేవలం ప్రాబల్యం ఉన్న నాయకుల సిఫార్సులతో కాకుండా, పార్టీకి విధేయులుగా ఉంటూ క్షేత్రస్థాయిలో పనిచేసిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలని అధిష్ఠానం భావిస్తోంది.ఈ నేపథ్యంలోనే సీడబ్ల్యూసీ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు తెలిపారు. ఏఐసీసీ నాయకులు ఆధ్వర్యంలో జాబితా ఫిల్టర్ కావడం లో కొంత వరకు రాష్ట్ర నాయకత్వ సిఫారసులు కూడా తగ్గుతాయని, తద్వారా పనిచేసిన నాయకులకు పదవులు దక్కే ఛాన్స్ ఉన్నదని ఆశావహులు చెబుతున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితా ఫిల్టర్ కు ఏఐసీసీ ప్రత్యేక సర్వేలు కూడా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు మాత్రమే హైకమాండ్ సర్వేలు చేయించింది. కానీ ఇక నుంచి ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఆశించే వారిపై కూడా సర్వేలు చేయించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
Also Read: ఫిలిప్స్ నుంచి అదిరిపోయే 5G ఫోన్.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!
ప్రస్తుతం పదవుల్లో ఉన్న కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం పూర్తి కావడం, రెన్యువల్స్ , కొత్త నియామకాలు చేపట్టాల్సిన తరుణంలో ఈ నిర్ణయం రావడం ఆసక్తికరంగా మారింది.సీడబ్ల్యూసీ మీటింగ్ లో తీసుకున్న కొత్త నిర్ణయంతో పదవుల రెన్యువల్ ఆశిస్తున్న నాయకులకు ఇప్పుడు పెద్ద సవాల్ గామారింది. గత రెండేళ్లలో వారి పనితీరు, ప్రజాదరణ, పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకోనున్నారు.ఈ నేపథ్యంలో అగ్రనేతల అభయహస్తం లేకపోయినా, అధిష్ఠానం నేరుగా పరిశీలిస్తుండటంతో కష్టపడి పనిచేసిన ద్వితీయ శ్రేణి నాయకులకు, యువ నాయకులకు ఈ నిర్ణయం సానుకూలంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలు తమకు నచ్చిన వారికి పదవులు కట్టబెట్టే ధోరణికి స్వస్తి పలికి, పార్టీ ప్రయోజనాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వడమే లక్ష్యంగా ఏఐసీసీ ఈ అడుగు వేసింది. పార్టీ అధికారంలోకి రావడానికి శ్రమించిన అసలైన కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేయడమే కాకుండా, రాబోయే ఎన్నికల నాటికి పార్టీ యంత్రాంగాన్ని మరింత బలపరచడానికే ఈ స్క్రీనింగ్ ప్రక్రియను తీసుకొచ్చారని పార్టీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ కొత్త నిబంధనతో రాబోయే రోజుల్లో కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం, రెన్యువల్ల ప్రక్రియ ఎంతటి ట్విస్ట్ ఇస్తుందోనని పలువురు ఆశావహులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
Also Read: వరుడికి సోదరిగా మారి.. వధువుకు తాళి కట్టిన కవిత.. కీసర పెళ్లిలో ఆసక్తికర ఘటన!