GHMC: స్వేచ్చ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని అత్యధిక జనాభాకు పౌర, అత్యవసర సేవలందించే జీహెచ్ఎంసీలోకి ఇతర ప్రభుత్వ శాఖల నుంచి డిప్యూటేషన్ పై వచ్చే అధికారులు ఒక్కసారి జీహెచ్ఎంసీలోకి వచ్చి వాలిన తర్వాత డిప్యూటేషన్ గడువు ముగిసినా ఆ సీటు వదిలి వెళ్లేందుకు ఇష్టపడరు. జీహెచ్ఎంసీలో పోస్టింగ్ అంటేనే లక్షల రూపాయలతో చేసుకునే పైరవీగా మారిపోయింది. జీహెచ్ఎంసీ ప్రజలకు అందించే వివిధ రకాలైన పౌర సేవలతో పాటు అత్యవసర సేవలందించేందుకు విద్యుత్, మెడికల్ అండ్ హెల్త్, నీటిపారుల, పబ్లిక్ హెల్త్, పంచాయతీరాజ్ వంటి ఇతరాత్ర విభాగాల నుంచి అధికారులు జీహెచ్ఎంసీలోకి డిప్యూటేషన్లపై విధులు నిర్వహిస్తుంటారు.
ఇదే రకంగా ఇటీవలే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి జీహెచ్ఎంసీలోకి సీనియర్ ఎంటమాలజిస్టుగా వచ్చిన ఓ అధికారి జీహెచ్ఎంసీలోనే కొనసాగేందుకు నాలుగు నెలలుగా విశ్వప్రయత్నాలు చేసినా, ఫలించకపోవటంతో ఎట్టకేలకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ సదరు అధికారులను డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మూడేళ్ల క్రితం సీనియర్ ఎంటమలాజిస్టుగా వచ్చన సదరు అధికారి డే వన్ నుంచి కూడా తాను కమిషనర్ మనిషిని, తనను ఎవరూ ఏం చేయలేరంటూ దబాయిస్తూ వచ్చారు.
ఇదే అదునుగా సదరు అధికారి మూడేళ్ల క్రితం నగరంలో ఓ ఇంటిని కొనుగోలు చేసి, దాని ఈఎంఐ నెలకు రూ. 70 వేలను తన కింది స్థాయి సిబ్బందిని నుంచి లంచాలుగా డిమాండ్ చేసిన ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేగాక, కమిషనర్ వద్ద తనకున్న చొరవతో నగరంలోని ఆరు జోన్లలో ఏకంగా మూడు జోన్ల దోమల నివారణ బాధ్యతలు (ఎంటమాలజీ) తానే దక్కించుకున్నారు. పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట సర్కిల్ లో ఓ ఎంటమాలజీ ఫీల్డు అసిస్టెంట్ ను తిరిగి ఉద్యోగంలోకి తీసుకునేందుకు లంచం డిమాండ్ చేసినట్లు కూడా ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై ఆయన విజిలెన్స్ విచారణ కూడా ఎదుర్కొన్నట్లు తెలిసింది.
Also read: పరువు కోసం మేనకోడల్ని చంపిన మామ.. ఆత్మ వెంటాడకుండా ఉండేందుకు మేకులు, ఉప్పుతో కలిపి
గత ఏప్రిల్ మాసంతో తన డిప్యూటేషన్ గడువు ముగిసినా, జీహెచ్ఎంసీలోనే కొనసాగేందుకు విశ్వప్రయత్నాలు చేయగా, అవేవీ ఫలించకపోవటంతో శుక్రవారం ఆయన్ను డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన నిర్వహించిన దోమల నివారణ బాధ్యతలను సర్కిళ్ల వారీగా మెడికల్ ఆఫీసర్లకు అప్పగించనట్లు సమాచారం. ఇదే రకంగా ఎలక్ట్రికల్, మెడికల్ అండ్ హెల్త్, పబ్లిక్ హెల్త్ వంటి ఇతర విభాగాల నుంచి జీహెచ్ఎంసీలోకి డిప్యూటేషన్లపై విధులు నిర్వహిస్తున్న అధికారుల్లో గడువు ముగిసిన అధికారులను తిరిగి తమ మాతృ శాఖలకు పంపించే విషయంపై ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టినట్లు సమాచారం.
ప్రధాన కార్యాలయంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న మరో ఇంజనీర్ పై కూడా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. 2024-25 లో నిర్వహించిన నాలాల పూడికతీత పనుల్లో చేయని పనులకు బిల్లులు క్లెయిమ్ చేసిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ఇంజనీర్ పై కమిషనర్ కర్ణన్ విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు తెల్సింది. ప్రస్తుతం సదరు అధికారి సూపరింటెండెంట్ ఇంజనీర్ బాధ్యత నుంచి తప్పించగా, ప్రస్తుతం ఆయన ఈఈగా విధులు నిర్వహిస్తున్నారు.
Also Read: పాలిటెక్నిక్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. డిప్లొమాకు ఐఐటీ రేంజ్ ప్రాధాన్యత!