Furniture Shop Fire: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మంగళవారం దారుణ సంఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని ప్రముఖ మహాలక్ష్మి ఫర్నిచర్ దుకాణంలో ఒక్కసారిగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం క్షణాల్లోనే దుకాణమంతటా విస్తరించి.. లోపల ఉన్న విలువైన ఫర్నిచర్ వస్తువులను బూడిద చేసింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
కూలీల హాహాకారాలు.. ఒకరి సజీవ దహనం
షాప్లోనే నిద్రిస్తున్న నలుగురు ఉత్తరప్రదేశ్ కూలీలు అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో తీవ్ర తీవ్రభయాందోళనకు గురయ్యారు. గాఢ నిద్రలో ఉన్న వారు బయటకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అందులో ముగ్గురు ప్రాణాల దోసిట్లో పట్టుకుని బయటకు పరుగులు తీసి సురక్షితంగా బయటపడ్డారు. మరో కూలీ మంటల మధ్య చిక్కుకుపోయాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన మమ్మద్ ఇస్లాం అనే కూలీ బయటకు రాలేక మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు.
శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది
ప్రమాద తీవ్రత భారీగా ఉండటంతో మంటలు పక్క ప్రాంతాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. షాప్ ముందు భాగం, గోడలు అడ్డుగా ఉండటంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడింది. దీంతో జేసీబీ సహాయంతో గోడలు, షట్టర్లను బద్దలు కొట్టి లోపలికి ఫైర్ ఇంజిన్ల ద్వారా నీటిని చల్లారు. కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
రూ. లక్షల్లో ఆస్తి నష్టం
ఈ ప్రమాదంలో ఫర్నిచర్ షాప్ పూర్తిగా దగ్ధమైంది. లోపల ఉన్న బెడ్లు, సోఫాలు, ఇతర చెక్క సామాగ్రి పూర్తిగా కాలిన బూడిదవడంతో రూ. లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
Also Read: ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు కలకలం.. సుప్రీంకోర్టు సంచలన నివేదిక!