KTR Arrest: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన నమోదు కాబోతుందా? మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్ట్కు రంగం సిద్ధమైందా? ఫార్ములా ఈ-కార్ రేసులో కుంభకోణానికి సంబంధించి కేటీఆర్ ఊచలు లెక్కలు పెట్టాల్సిందేనా? ఇప్పటి వరకు కేటీఆర్ విచారణకు నోటీసులు ఇవ్వడానికి అనుమతి కోరుతూ గవర్నర్ వద్ద పెండింగ్లో ఫైల్కు ఆయన అనుమతిచ్చారా? తన అరెస్టు పదేపదే మాట్లాడుతున్న గులాబీ పార్టీ చిన్నబాస్ సీఐడీ విచారణ ఎదుర్కొన్ని కోర్టు మెట్లు ఎక్కాల్సిందేనా?
ఫార్ములా ఈ-కార్ రేసులో భారీ అవినీతికి పాల్పడినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. ఈ క్రమంలోనే.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు ఇచ్చేందుకు అనుమతి కోరుతూ గవర్నర్కు ఫైల్ పంపింది ప్రభుత్వం. తాజాగా ఆ ఫైల్ను గవర్నర్ ఆమోదించినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఆ ఫైల్ను గవర్నర్ కార్యాలయం.. రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిందట. ఫార్ములా-ఈ కార్ రేసు వ్యవహారంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం లభించినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
సంబంధిత ఫైల్ రెండు రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లు సమాచారం. హైదరాబాద్లో జరిగిన కార్ రేసుకు సంబంధించి ఉల్లంఘనలు జరిగాయని, నిర్వహణ సంస్థకు విదేశీ కరెన్సీ రూపంలో, ఒప్పందానికి ముందే నిధులు చెల్లించారని, ఇది నిబంధనలకు విరుద్ధమని, దీనిపై విచారణ చేయాలని ఎంఏయూడీ.. అక్టోబరులో ఏసీబీకి ఫిర్యాదు చేసింది. సంబంధం లేని హెచ్ఎండీఏ ఒప్పందం చేసుకోవడం, రిజర్వు బ్యాంకు ముందస్తు అనుమతి లేకుండానే రెండు దఫాలుగా రూ.46 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడం, దీనికి హెచ్ఎండీఏ బోర్డు అనుమతి లేకపోవడం తదితర అంశాలను అందులో పేర్కొన్నట్లు తెలిసింది.
దాంతో అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్, చీఫ్ ఇంజినీరుతోపాటు గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి అనుమతివ్వాలని ప్రభుత్వానికి ఏసీబీ లేఖ రూపంలో విన్నవించింది. ఈ మేరకు ఇద్దరు అధికారులపై విచారణకు అనుమతిచ్చిన ప్రభుత్వం… ప్రజాప్రతినిధి అయిన కేటీఆర్పై కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్కు గత నెలలోనే లేఖ రాసింది. ఈ అంశంపై న్యాయ సలహా తీసుకున్న అనంతరం గవర్నర్ అనుమతిచ్చినట్లు అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
Also Read: కాంగ్రెస్లో ఆ ఇద్దరికీ నో ఎంట్రీ
పార్ములా-ఈ కారు రేస్పై ఈ ఏడాది ఆరంభంలోనే ప్రస్తుత పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి.. అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్కు నోటీసు ఇవ్వగా, దానికి ఆయన సమాధానం సైతం ఇచ్చారు. అప్పటి మంత్రి కేటీఆర్ ప్రోద్బలంతోనే విదేశీ కంపెనీకి నిధుల బదిలీ చేశామని వెల్లడించారు. అప్పటి నుంచి చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారం తాజాగా గవర్నర్ ఆమోదంతో కొత్త మలుపు తిరిగే పరిస్థితి కనిపిస్తుంది. సిఐడీ విచారణ జరిగితే కేటీఆర్ అరెస్ట్ అవ్వడం ఖాయమన్న ప్రచారం జరుగుతుంది
అయితే తన అరెస్టుకు సంబంధించి ఇప్పటికే కేటీఆర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. తాను ఏ కేసులకు భయపడేది లేదని.. అవసరమైతే అరెస్ట్ చేసుకున్నా పర్లేదని గతంలోనే ప్రకటించారు. ప్రతి విషయంలో అనుమతి ఇచ్చింది.. సంతకం చేసింది తానే అని స్పష్టం చేశారు. ఈ-రేసింగ్ సమయంలో మున్సిపల్ శాఖ మంత్రిగా తానే ఉన్నానని, FEOకు డబ్బులు చెల్లించడం వాస్తవమే అన్నారు. అది హైదరాబాద్ పేరును అంతర్జాతీయస్థాయిలో నిలిపేందుకు తీసుకున్న నిర్ణయమన్నారు.
ఇప్పుడనే కాదు ఈ మధ్య కాలంలో పార్టీ కార్యక్రమాలు సభలు సమావేశాల్లో పాల్గొంటున్న కేటీఆర్ పదేపదే తన అరెస్టు గురించి మాట్లాడుతున్నారు. ఇటీవల కూడా అరెస్ట్ గురించి మాట్లాడిన ఆయన తనను అరెస్ట్ చేస్తే జైల్లో యోగా చేసి, ఫిట్ నెస్ పెంచుకుని .. పాదయాత్రకు రెడీ అవుతానని గొప్పగా చెప్పుకొచ్చారు.
కేటీఆర్ ఎంత గంభీరంగా స్టేట్మెంట్లు ఇష్తున్నప్పటికీ.. ఆయన అరెస్టుతో పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని పార్టీలోని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అరెస్ట్ అయితే పొలిటికల్ మైలేజీ పెరుగుతుందని ఆయన భ్రమల్లో ఉన్నట్లు కనిపిస్తుందని విమర్శలు గుప్పిస్తున్నారు. లోక్సభ ఎన్నికల ముందు ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ అయ్యారని.. ఆ ప్రభావం ఎన్నికల్లో ఎలా రిఫ్లెక్ట్ అయిందో ఆయన మర్చిపోయినట్లున్నారని యద్దేవా చేస్తున్నారు. మొత్తానికి కేటీఆర్ అరెస్ట్ అవుతారన్న ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిందిప్పుడు.