Nagarkurnool Municipal Elections: నాగర్ కర్నూల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో మున్సిపల్ పీఠం కోసం ఇద్దరు జనార్దనులు కలిసి వేసిన స్కెచ్ బెడిసి కొట్టి, తలకిందులైంది.. దాంతో గులాబీ సేన గప్చుప్ గా ఉండి పోయిందట. ఎన్నికల్లో వరుస ఎదురు దెబ్బలకు తోడు లేటెస్ట్గా వచ్చిన రిజల్ట్ ఆ ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను , వారి క్యాడర్ ను అయోమయంలో పడేసిందంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరు జనార్ధనులు కలిసిన పన్నిన పద్మ వ్యూహాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలైన కూచుకుల్ల తండ్రి కొడుకులు చేధించి ఆ ఇద్దరు సీనియర్లకు పెద్ద షాక్ ఇచ్చారంట.. దాంతో నాగం జనార్దన్ రెడ్డి , మర్రి జనార్దన్ రెడ్డిలకు ఎటూ పాలుపోవడం లేదంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కందనూలు జిల్లా .. అదేనండి నాగర్కర్నూల్గా పాపులర్ అయిన జిల్లా అంటే తెలియని వారు ఉండరు. గత పదేళ్లుగా నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో గులాబీ పార్టీ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధనరెడ్డి హవా నడిచింది. గులాబీ పార్టీ నుంచి మర్రి జనార్ధనరెడ్డి 2014, 2018 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. అంతకు ముందు 1985లో నాగర్కర్నూల్ నుంచి తొలిసారి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన నాగం జనార్ధనరెడ్డి, తర్వాత 1994 నుంచి 2012 వరకు అక్కడ వరుస విజయాలు సాధించి టీడీపీలో నెంబరు టూగా చక్రం తిప్పారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీని వీడిన నాగం జనార్ధనరెడ్డి ఆ పార్టీ ఈపార్టీ మారి గత ఎన్నికల ముందు బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద జనార్ధనుడు మర్రి జనార్ధన్ కోసం పనిచేసినప్పటికీ నాగర్కర్నూలులో బీఆర్ఎస్కు ఓటమి తప్పలేదు. నాగర్కర్నూల్ని తమ కంచుకోటగా భావించే ఇద్దరు జనార్ధులకు కాంగ్రెస్ యువనేత కూచుకుళ్ల రాజేష్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో షాక్ ఇచ్చి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓ లెక్క ఇప్పుడు ఒక లెక్క అన్నట్టుగా తయారైంది బీఆర్ఎస్ పరిస్థితి.. బలమైన క్యాడర్తో ఆ నియోజకవర్గ గతంలో గులాబీపార్టీకి కంచుకోటలా ఉండేది. ఉద్యమ కాలంలో పార్టీకి కనెక్ట్ అయిన ఎంతో మంది నాయకులు చాలా కాలం పార్టీకి వెన్నంటే నడిచారు. టీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలో ఉన్న సమయంలో భారీగా వలసలు పెరిగాయి.. అసలు జిల్లాలో ఏ ఇతర పార్టీలకు లేనంతగా గులాబీ పార్టీలో చేరికలు జరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
Also Read: Harsha Kumar: పరకామణి చోరీ కేసులో అసలు దొంగలెవరు? చంద్రబాబు వైఖరిపై హర్షకుమార్ ఫైర్!
నాగర్కర్నూల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన గులాబీపార్టీకి ఏ ఎన్నికలు వచ్చినా విజయం నల్లేరు మీద నడకలా సాగుతూ వచ్చింది… ముఖ్యంగా గ్రామాల్లో ఆ పార్టీ బలమైన కేడర్ ను ఏర్పాటు చేసుకోగలిగింది. నాడు ఉద్యమకారులంతా గులాబీ గూటికి చేరి మద్దతు ఇవ్వడమే కాదు, ఆ పార్టీని అధికారంలో తీసుకువచ్చేందుకు విశేషంగా కృషి చేశారు.. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితి రివర్స్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నాగర్కర్నూల్లో కారు పార్టీకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో నాగర్ కర్నూల్, బిజినపల్లి, తిమ్మాజిపేట, తాడూరు, తెలకపల్లి మండలాల పరిధిలో 131 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు 71 మంది గెలుపొందగా బిఆర్ఎస్ 50 గెలుపొందారు. దాంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోయిన గులాబీ పార్టీకి కాస్త ఊరట లభించినట్లైంది. అయితే ఆ ఆనందం అట్టే కాలం నిలవలేదు.
పంచాయతీ ఎన్నికల్లో పర్వాలేదనిపించుకున్న బీఆర్ఎస్ కు మున్సిపల్ ఎన్నికల్లో అక్కడి కాంగ్రెస్ వర్గాలు చుక్కలు చూపించాయి. నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా వాటిలో 18 స్థానాలలో కాంగ్రెస్ జయకేతనం ఎగరవేసి పురపాలకసంఘాన్ని కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇన్చార్జిల్లుగా వ్యవహరిస్తూ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేశారు.. తమ వారిని కౌన్సిలర్లుగా గెలిపించుకోవాలన్న పట్టుదలో స్కెచ్లు గీశారు. అయితే వారు వేసిన స్కెచ్లను తండ్రీకొడుకులైన ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి ,ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తిప్పి కొట్టారు. ఊహించని ఫలితాలతో ఇద్దరు జనార్ధనుల ఆశలకు గండి కొట్టారు.
కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో తండ్రి తన రాజకీయ అనుభవాన్ని రంగరిస్తే .. అభ్యర్థుల గెలుపు కోసం తనయుడు ప్రచారంలో దూసుకెళ్లారు. అలా 24 వార్డులలో 18 వార్డులలో కాంగ్రెస్ జెండా ఎగురవేసి కారు పార్టీకి షాక్ ఇచ్చారు. కందనూరు గడ్డపై ఎన్నికలు ఏవైనా… గెలిచేది తామే అని చెప్పుకొచ్చిన మర్రి జనార్దన్ రెడ్డిని నాగర్ కర్నూల్ మున్సిపల్ ప్రజల ఏకపక్ష తీర్పు జీర్ణించుకోలేని పరిస్థితిలోకి నెట్టివేసింది .. ఆయన క్యాడర్ గత పదేళ్లలో చేసిన ఓవర్ యాక్షన్ ఫలితమే ఈ రిజల్ట్ అని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది.. ఆ క్రమంలో రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో ప్రతిపక్షపార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుందన్న దానిపై అప్పుడే కందనూరులో … కాయ్ రాజా కాయ్ … అంటున్నారంట పందెంరాయుళ్లు.
Story By Apparao Big TV
Also Read: Harish Rao : సీఎం రేవంత్ సవాల్కు హరీశ్ సై.. ఈసారైనా సభలోనే ఉంటారా?