Nagavali River: పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ, కురుపాం మండలాల సరిహద్దుల్లో ప్రవహిస్తున్న నాగావళి నదిపై గిరిజనులు నిత్యం సాగిస్తున్న జీవన్మరణ పోరాటమిది. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. నదికి అవతలి వైపు ఉన్న కురుపాం, జియ్యమ్మవలస, కొమరాడ మండలాల పరిధిలోని దాదాపు 40 గిరిజన గ్రామాలు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి దిగ్బంధంలో చిక్కుకుంటాయి.
ఫైబర్ పడవలపై, లేదా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉద్ధృతంగా పారే నదిలో దిగి ప్రయాణించడం ఇక్కడి ప్రజలకు తప్పని సమస్యగా మారింది. అత్యవసర సమయంలో గర్భిణులు, వృద్ధులను హాస్పిటల్కు తరలించడం ఇక్కడ ఓ పెద్ద సాహసమే. సరైన టైంకి ట్రీట్మెంట్ అందక నది ఒడ్డునే ప్రాణాలు విడిచిన ఘటనలు లెక్కలేనన్ని. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, పండించిన పంటను మార్కెట్కు తరలించాలనుకునే రైతులు.. ఇలా ప్రతి ఒక్కరి బతుకూ నాగావళి దాటే సాహసంతోనే ముడిపడి ఉంది.
Also Read: టైపింగ్ మాత్రమే కాదు..మీ ఫోన్ కీబోర్డ్ చేసే అద్భుతమైన పనులు ఇవే!
ఈ పూర్ణపాడు – లాబేసు వంతెనకు రెండు దశాబ్దాల కన్నీటి చరిత్ర ఉంది. 1996లో తొలిసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హామీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత 2006లో నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో, సీపీఎం మాజీ ఎమ్మెల్యే కోళక లక్ష్మమూర్తి చొరవతో సుమారు 3 కోట్ల రూపాయల అంచనాతో బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. ఏళ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారినా, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, పెరిగిన అంచనా వ్యయాల సాకుతో పనులను అలానే వదిలేశారు. ప్రస్తుతం నది మధ్యలో నాటిన పిల్లర్లు, తుప్పు పట్టిన ఇనుప చువ్వలు పాలకుల నిర్లక్ష్యానికి, గిరిజనుల పట్ల ప్రదర్శిస్తున్న చిన్నచూపునకు నిలువెత్తు సాక్ష్యాలుగా దర్శనమిస్తున్నాయి.
ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులు వంతెన పూర్తి చేస్తామని ఇచ్చే హామీలు, గెలిచాక గాల్లో కలిసిపోతున్నాయి. గిరిజనుల ఓట్లతో అధికారంలోకి వస్తున్న ప్రజాప్రతినిధులు, వారి కనీస రవాణా సౌకర్యాన్ని పూర్తిగా విస్మరించడంపై మన్యం వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యా, వైద్యం, ఉపాధి కోసం దశాబ్దాలుగా ప్రాణాలను పణంగా పెడుతున్న ఈ గిరిజనుల ఆక్రందనలు పాలకులకు ఎప్పటికి వినిపిస్తాయో చూడాలి.
Also Read: సముద్ర గర్భంలో బోయింగ్ విమానాలు.. కూలిపోలేదు, కావాలనే ముంచేశారు.. ఎందుకంటే?