Shankar: హీరో, హీరోయిన్ల వారసులు మాత్రమే కాదు.. దర్శకులు, నిర్మాతల వారసులు కూడా హీరోహీరోయిన్లే అవ్వాలనుకుంటున్నారు. వారికి తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడం పెద్ద విషయం ఏమీ కాదు. కానీ ఇండస్ట్రీలో ఎంతకాలం ఉండాలి, ఎంత సక్సెస్ వస్తుంది అనేది కేవలం వారి టాలెంట్పైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా నెపో కిడ్స్ అనే ట్యాగ్తో ఇండస్ట్రీలోకి రాగానే ప్రేక్షకుల్లో ఒక రకమైన నెగిటివ్ అభిప్రాయం ఏర్పడుతుంది. అయినా కూడా నెపో కిడ్స్ మాత్రం ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడం ఆగడం లేదు. తాజాగా ‘గేమ్ ఛేంజర్’ డైరెక్టర్ శంకర్ కూడా తన వారసుడిని హీరో చేయడానికి సిద్ధమయినట్టు సమాచారం.
వారసుడు వస్తున్నాడు
అసలు పాన్ ఇండియా అనే ట్యాగ్ లేనప్పుడే పాన్ ఇండియా రేంజ్లో సినిమాలు డైరెక్ట్ చేయడం మొదలుపెట్టాడు శంకర్. తమిళంలో సినిమాలు డైరెక్ట్ చేసినా తెలుగులో కూడా అవన్నీ బ్లాక్బస్టర్ హిట్ అయ్యాయి. కానీ గత కొన్నేళ్లలో శంకర్ ఫామ్ పూర్తిగా పోయింది. ఔట్డేటెడ్ కథలను తెరకెక్కిస్తూ ప్రేక్షకుల విమర్శలు ఎదుర్కుంటున్నాడు. తాజాగా రామ్ చరణ్తో కలిసి శంకర్ తెరకెక్కించిన ‘గేమ్ ఛేంజర్’ కూడా యావరేజ్ టాక్ మాత్రమే సంపాదించుకుంది. టాక్ విషయం పక్కన పెడితే ఒకప్పుడు స్టార్ డైరెక్టర్గా పేరు దక్కించుకున్న శంకర్ టేకింగ్పై ఇప్పుడు ప్రేక్షకులు విమర్శలు కురిపిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే తన వారసుడిని హీరోగా పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాడట ఈ దర్శకుడు.
హీరోగా డెబ్యూ
దర్శకుడు శంకర్కు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అందులో తన పెద్ద కూతురికి పెళ్లయ్యి ఫ్యామిలీ లైఫ్లో బిజీ అయిపోయింది. కానీ చిన్న కూతురు అదితి మాత్రం తండ్రిని ఒప్పించి హీరోయిన్గా మారింది. అదితి శంకర్ హీరోయిన్గా మాత్రమే కాదు.. సింగర్గా కూడా తన టాలెంట్ను నిరూపించుకుంది. ఇప్పటికే తనకంటూ ఇండస్ట్రీలో ఒక గుర్తింపు లభించింది. ఇక కూతురి వంతు అయిపోవడంతో తరువాత కుమారుడిని వారసుడిగా పరిచయం చేయనున్నాడు శంకర్. ఇప్పటివరకు శంకర్కు ఒక కుమారుడు ఉన్నాడన్న విషయం కూడా చాలామంది ప్రేక్షకులకు తెలియదు. అలాంటిది ఒక్కసారిగా తను హీరోగా పరిచయం కానున్నాడనే వార్త కోలీవుడ్లో వైరల్ అవుతోంది.
Also Read: ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న దుల్కర్ సల్మాన్.. ఇదిగో ప్రూఫ్ అంటూ ఫోటోస్ వైరల్..
అసిస్టెంట్ డైరెక్టర్గా
శంకర్ (Shankar) కుమారుడు అర్జిత్ (Arjith) ఇప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో ఎప్పుడో అడుగుపెట్టాడు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా తను పనిచేశాడు. అంతే కాకుండా ప్రస్తుతం మురుగదాస్, శివకార్తికేయన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘మద్రాసి’ సినిమాకు కూడా అర్జిత్ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాడు. ఇక డైరెక్షన్ చాలు అనుకున్నాడో ఏమో హీరోగా డెబ్యూ ఇవ్వడానికి రెడీ అయ్యాడట. ప్రభుదేవ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాతో అర్జిత్ హీరోగా డెబ్యూ చేయనున్నాడని సమాచారం. ఒకప్పుడు ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించిన ప్రభుదేవ.. ప్రస్తుతం డైరెక్షన్కు బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడు అర్జిత్తో చేయబోయే సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వాలనే ప్లాన్లో ఉన్నాడట.