China Dam Brahmaputra River | టిబెట్ దేశ భూభాగంలో బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాం నిర్మించడానికి చైనా రెడీ అయింది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల భారత్పై తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ఈ ప్రాజెక్టును భారత ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. ఇలా పక్క దేశాల్లోకి ప్రవహించే నదులపై చైనా భారీ ప్రాజెక్టులు కట్టడం కరెక్ట్ కాదని, ఇలాంటి ప్లాన్లు వేసే ముందు కనీసం ఆ ప్రభావిత దేశాలతో సంప్రదింపులు జరపాలని భారత్ డిమాండ్ చేస్తోంది.
చైనా అంటేనే భారీ నిర్మాణాలకు పెట్టింది పేరు. సెంట్రల్ చైనాలో కట్టిన త్రీ గార్జెస్ డ్యాం ఆ దేశం ఎలాంటి నిర్మాణాలు కట్టగలదో చూపించే నిదర్శనం. ఈ డ్యాం బరువు వల్ల ఏకంగా భూమి తన చుట్టూ తాను తిరిగే స్పీడు 0.06 సెకన్లు తగ్గిపోయిందంటే.. ఆ డ్యాం ఎంత భారీగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పుడు అంతకుమించిన భారీ డ్యాంను బ్రహ్మపుత్ర నదిపై కట్టాలని చైనా డిసైడ్ అయింది. వచ్చే ఐదేళ్లలో ఈ నిర్మాణం పూర్తి చేయాలనేది డ్రాగన్ కంట్రీ ప్లాన్. ఇదే భారత్కు చికాకు తెప్పిస్తోంది.
ఎందుకంటే బ్రహ్మపుత్ర నది.. భారత దేశానికి కూడా చాలా కీలకమైన నీటి వనరు. ఈశాన్య రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా అస్సాం రాష్ట్రానికి చాలావరకు నీటి సరఫరా బ్రహ్మపుత్ర నది వల్లనే జరుగుతోంది. ఇలాంటి నదిపై ఇంత పెద్ద డ్యాం కడితే.. కిందకు ప్రవహించాల్సిన నీరు ఆగిపోతుందనేది భారత్ వాదన. దీని వల్ల రెండు దేశాల మధ్య నీళ్ల కోసం గొడవలు తప్పవని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. మనతోపాటు బంగ్లాదేశ్కు కూడా బ్రహ్మపుత్ర నది కీలకమే. కానీ ఇవేమీ పట్టించుకోకుండా, ఈ దేశాలతో సంప్రదింపులేవీ లేకుండానే చైనా ఈ భారీ నిర్మాణానికి అనుమతులు ఇచ్చేసింది.
Also Read : డబ్బుల కోసం వ్యభిచారం చేస్తున్న టీచర్లు, డాక్టర్లు.. ఆ దేశంలో దిక్కుతోచని స్థితిలో మహిళలు!
అంతేకాదు, పర్యావరణ పరంగా కూడా చాలా సున్నితమైన టిబెట్లో ఈ డ్యాం కట్టాలని చైనా అనుకోవడం కూడా ఆందోళనలకు దారితీస్తోంది. ఈ డ్యాం నిర్మించే ప్రాంతంలో భూమి పొరలు చాలా సున్నితంగా ఉంటాయి. ఇక్కడ గతంలో చాలా భూకంపాలు వచ్చాయి. భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఇలాంటి ప్రాంతంలో ఇంత భారీ కట్టడం నిర్మిస్తే.. చుట్టుపక్కల ప్రాంతాలపై కూడా తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉంది. అసలే పర్యావరణ సమస్యల వల్ల ఇటీవలి కాలంలో భూకంపాలు, వరదలు పెరుగుతున్న సమయంలో.. చైనా తీసుకున్న నిర్ణయంపై పర్యావరణ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటితోపాటు ఈ డ్యాం వల్ల ఎన్నో జియోపొలిటికల్, హైడ్రాలాజికల్ సమస్యలు కూడా వస్తాయని భారత్ వాదిస్తోంది.
అందుకే, చైనా ఈ డ్యాం నిర్మించాలని ప్రకటించిన వెంటనే బ్రహ్మపుత్ర నదీజలాలపై తమకున్న హక్కును గుర్తుచేస్తూ భారత్ స్పందించింది. ఇలాంటి ప్రాజెక్టుల విషయంలో పారదర్శకత ఉండాలని, పక్క దేశాలతో సంప్రదింపులు జరపాలని చైనాకు హితబోధ చేసింది. భారత విదేశాంగ శాఖ కూడా ఈ డ్యాం విషయాలను తాము చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని, దీని వల్ల భారత్కు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇలా చైనా కడుతున్న డ్యాంలపై భారత్ అసంతృప్తి వ్యక్తం చెయ్యడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా పలుమార్లు చైనా ఇలాగే భారత్లోకి ప్రవహించే నదులపై డ్యాంలు కట్టేందుకు ప్రయత్నిస్తే భారత ప్రభుత్వం ప్రశ్నలు లేవనెత్తింది.