Ukraine Drone Attack Moscow| ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడి చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్ ప్రతీకారం తీర్చుకుంది. రష్యాపై అతిపెద్ద డ్రోన్ దాడి చేసింది ఉక్రెయిన్. 337 డ్రోన్లతో ఉక్రెయిన్ మెరుపు దాడులకు దిగింది. ఈ ఘటనలో రష్యాకు చెందిన ముగ్దురు మృతిచెందగా, 18 మంది తీవ్రంగా గాయపడినట్లు రష్యా వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్ దాడితో రష్యా అప్రమత్తమైంది. అయితే 337 డ్రోన్లలో 91 డ్రోన్లను రష్యా కూల్చేసింది.
ఒకవైపు శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా, ఉక్రెయిన్ దేశాలు చెప్పుకుంటూనే.. మరోవైపు పరస్పరం మెరుపు దాడులు చేసుకుంటున్నాయి. ఇంతకుముందు అగ్రరాజ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో శాంతి చర్చలు జరిపారు. ఆ చర్చలు విఫలం కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికి చేరుకుంది.
Also Read: పాకిస్థాన్ లో ప్రయాణికుల రైలు హైజాక్ – 100 మందికి పైగా బందీ – ఉగ్రవాదుల డిమాండ్లు ఇవే
రష్యా సైన్యం భీకర దాడులతో ఉక్రెయిన్పై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. రాజధాని కీవ్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల పై రష్యా వైమానిక దాడులు చేస్తోనే ఉంది. అయితే, ఆ దాడులను తమ దేశ వైమానిక దళం సమర్థవంతంగా అడ్డుకుంటోందని కీవ్ మేయర్ విటాలి కీచ్కోస్ తెలిపారు.
తమకు పేలుడు శబ్దాలు ఎక్కువగా వినిపిస్తున్నాయని కీవ్(Kyiv)లోని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆస్తి మరియు ప్రాణ నష్టం వివరాలు తెలియరావాల్సి ఉంది. మరోవైపు, సౌదీ అరేబియాలో ఉక్రెయిన్ మరియు అమెరికా అధికారులు శాంతి చర్చలు జరపనున్నారు. ఈ నేపథ్యాన్ని పట్టించుకోకుండా రష్యా దాడుల ఉగ్రతను పెంచింది.
రెండు రోజుల కిందట ఖర్కీవ్ రీజియన్లోని డోబ్రోపిలియా నగరంపై రష్యా జరిపిన క్షిపణుల దాడిలో విధ్వంసం చోటు చేసుకుంది. ఈ దాడుల్లో 14 మంది మరణించగా, 37 మంది గాయపడ్డారు. ఈ దాడులతో రష్యా ఉద్దేశాల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ, తమ పౌరుల ప్రాణాలను రక్షించుకునేందుకు ఎంతకైనా తెగిస్తామన్నారు.
శాంతి ఒప్పందంలో ఉక్రెయిన్ భూమిని వదులుకోవాల్సిందే: అమెరికా
శాంతి ఒప్పందం కోసం 2014 తర్వాత రష్యా ఆక్రమించుకున్న భూమిపై ఉక్రెయిన్ ఆశలు వదులుకోవాల్సిందేనని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తేల్చి చెప్పారు. అప్పుడే సంధి జరిగి యుద్ధం ఆగుతుందన్నారు. శాంతి చర్చల కోసం ఉక్రెయిన్ అధికారులతో మాట్లాడేందుకు సౌదీ అరేబియా రాజధాని జెడ్డాకు చేరుకున్న సందర్భంగా మార్కో రూబియో ఈ వ్యాఖ్యలు చేశారు. శ్వేతసౌధంలో ట్రంప్-జెలెన్స్కీల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న 10 రోజుల తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం ఉక్రెయిన్కు సైనిక సాయం మరియు ఇంటెలిజెన్స్ సమాచారం నిలిపివేసింది.
రూబియో విలేకర్లతో మాట్లాడుతూ, ‘‘ఉక్రెయిన్ శాంతి ఒప్పందం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందన్న అంచనాలతోనే నేను ఇక్కడికి వచ్చాను. అదే సమయంలో యుద్ధం ముగించాలంటే రష్యా కూడా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇరుపక్షాలు ఓ అవగాహనకు రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితికి సైనిక పరిష్కారం లేదు. ఇక ఉక్రెయిన్ మొత్తాన్ని రష్యా ఆక్రమించలేదు. అదే సమయంలో 2014 నాటి స్థితికి రష్యాను ఉక్రెయిన్ చేర్చలేదు’’ అని పేర్కొన్నారు. అంతకుమించి ఒప్పందం వివరాలను మాత్రం ఆయన వెల్లడించేందుకు నిరాకరించారు.
ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా సౌదీలోని జెద్దా నగరానికి చేరుకున్నారు. సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యుద్ధ ఖైదీల విడుదలకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు.
కుర్స్ క్ ప్రాంతంలో రష్యా దూకుడు
ఉక్రెయిన్ స్వాధీనం చేసుకున్న కుర్స్ క్ ప్రాంతాన్ని రష్యా దళాలు తిరిగి స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టాయి. అమెరికా నుంచి సైనిక మరియు ఇంటెలిజెన్స్ సాయం నిలిచిపోవడంతో మాస్కో సేనలు రెట్టించిన ఉత్సాహంతో దాడులు చేస్తున్నాయి. వీటికి తోడు ఉత్తర కొరియా దళాలు కూడా గత కొన్ని రోజులుగా ఇక్కడ పలు ఉక్రెయిన్ స్థావరాలను స్వాధీనం చేసుకున్నాయి. కీవ్ నుంచి ఈ ప్రాంతానికి వస్తున్న కీలక వస్తువుల సరఫరాను తరలించేందుకు ఉపయోగించే రోడ్డును స్వాధీనం చేసుకోవడానికి రష్యా సేనలు యత్నిస్తున్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న ఉక్రెయిన్ సేనలను మాస్కో దళాలు చుట్టుముట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ ప్రచారాన్ని ఉక్రెయిన్ సైన్యం తిరస్కరిస్తోంది.