BJP New Chief: బీజేపీలో రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక పూర్తి అయ్యిందా? బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక ఎప్పుడు? ఏకగ్రీవంగా ఎంపిక జరుగుతుందా? ఈసారి మహిళలకు ఆ పదవి ఇవ్వాలని కమలనాథులు డిసైడ్ అయ్యారా? కీలక నేతలు నార్తిండియా చెందినవారు ఉండడంతో ఈసారి సౌత్కి ఆ పదవి ఇవ్వాలని ఆలోచన చేస్తోందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
బీజేపీలో కీలక నేతలు ఆలోచనలు వెరైటీగా ఉంటాయి. ఇప్పుడున్న నేతల తీరు వేరు. నేతలు ఒకటి తలిస్తే.. జరిగేది మరొకటి. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఆ పదవి కోసం సౌత్ నుంచి ముగ్గురు మహిళలు పోటీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొత్త అధ్యక్షుడు ఎవరు అనేదానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ మొదలైంది.
జులై నెల చివరినాటికి బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఓ వార్త ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం సాగుతోంది. ఈసారి అధ్యక్ష పదవి మహిళకు బీజేపీ కేటాయించే అవకాశమున్నట్లు ఈ మేరకు జాతీయ మీడియాలో ప్రచారం సాగుతోంది.
ఈసారి అధ్యక్ష పీఠం సౌత్కి ఇస్తున్నట్లు ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది. ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది. ప్రస్తుతం ఆ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ పదవి కోసం పార్టీ నుంచి ముగ్గురు మహిళల పేర్లను పార్టీ హైకమాండ్ పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, మరొకరు వనతి శ్రీనివాసన్, ఇంకొకరు ఎంపీ పురంధేశ్వరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
ALSO READ: నటుడు విజయ్ అభిమాని ఆత్మహత్య, సూసైడ్ నోట్లో షాకింగ్ విషయాలు
కొద్దిరోజుల కిందట పార్టీ ప్రధాన ఆఫీసులో అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్లతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఈ ముగ్గురు నేతల గురించి చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే చాన్స్ ఉందని బీజేపీ వర్గాల మాట.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనుభవం, నాయకత్వ సామర్థ్యంపై చర్చ జరిగిందట. ఆమెకు అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే దక్షిణాదిలో పార్టీ మరింత బలపడడం ఖాయమని భావిస్తోంది. తమిళనాడు లో ఎప్పటి నుంచో పాగా వేయాలని ఆలోచన చేస్తోంది. గత ఎంపీ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరిగింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకెతో కలిసి బీజేపీ వెళ్తోంది.
ఇదే సమయంలో తమిళనాడుకి చెందిన మహిళకు ఛాన్స్ ఇస్తే బాగుంటుందని కొందరి నేతల మాట. ఈమెకు ఆర్ఎస్ఎస్ మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న లోక్సభ ఎన్నికల నాటికి మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నది మోదీ సర్కార్ ప్లాన్. త్వరలో ఆ బిల్లు ఆమోదించాలని ప్రణాళికలు వేసింది.
మరొకరు తమిళనాడుకు చెందిన న్యాయవాది, బీజేపీ నేత వనతి శ్రీనివాసన్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ రాష్ట్ర అసెంబ్లీలో కోయంబత్తూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీలోకి ఆమె చేరి దాదాపు మూడు దశాబ్దాలు పైనే అయ్యింది. ఆనాటి నుంచి నేటివరకు ఆ రాష్ట్ర కార్యదర్శి, జనరల్ సెక్రటరీ, తమిళనాడు ఉపాధ్యక్ష పదవి సహా కీలక బాధ్యతలు ఆమె నిర్వహించారు.
ఐదేళ్ల కిందట మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా నియమించింది పార్టీ హైకమాండ్. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యురాలి కూడా. అధ్యక్ష బాధ్యతలకు ఆమెకు అప్పగిస్తే తమిళనాడులో పార్టీ పుంజుకునే అవకాశముందని అంచనా వేస్తున్నారు కమలనాథులు.
ఇదే క్రమంలో ఏపీ మాజీ అధ్యక్షురాలు, బీజేపీ ఎంపీ పురందేశ్వరి పేరు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం రాజమండ్రి బీజేపీ ఎంపీగా ఉన్నారు. పురంధేశ్వరి ఇప్పటికే పార్టీలో కీలక పదవులు నిర్వహించారు. గట్టిగా మాట్లాడేతత్వం ఆమె సొంతం. ఏపీ, తెలంగాణపై ఆమెకి పట్టు ఉందని, తమిళనాడుపై మంచి అవగాహన ఉందని అంటున్నారు.
పార్టీ కీలక నేతల నుంచి ఈమెకి మద్దతు ఉంది. మొత్తానికి ఈ ముగ్గురు మహిళలు కాకుండా తెరపైకి బీజేపీ హైకమాండ్ ఎవరినైనా తీసుకొస్తుందా? లేదా అన్నది చూడాలి. ఈసారి అధ్యక్ష పీఠం ఎవరికి అప్పగించినా రానున్న సార్వత్రిక ఎన్నికలు వారికి కత్తి మీద సామేనని అంటున్నారు.