PM Removal Bill: దేశవ్యాప్తంగా బీజేపీ ప్రతిష్ఠ మసకబారుతోందా? పీఎం, సీఎం, మంత్రుల ఉద్వాసన బిల్లుపై లోక్సభలో ఏం జరిగింది? ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ఆ బిల్లు ఎందుకు తెచ్చింది? దీనివెనుక ఏమైనా స్కెచ్ ఉందా? కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో నిజం ఉందా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను వెంటాడుతున్నాయి.
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరు. ఎవరు.. ఎప్పుడు.. ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో తెలియని పరిస్థితులు నెలకున్నాయి. కేంద్రంలో మూడు పర్యాయాలు ఎన్డీయే అధికారంలో ఉంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై స్వతహాగా ప్రజల్లో అసంతృప్తి ఉంటుంది. ఈ క్రమంలో మిత్రులు చేజారిపోకుండా బీజేపీ పెద్ద స్కెచ్ వేసినట్టు చెబుతోంది కాంగ్రెస్ పార్టీ.
బుధవారం లోకసభలో మూడు బిల్లులు ప్రవేశపెట్టారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. నేరాభియగాలున్న నేతల తొలగింపు విషయమై ఆ బిల్లు కీలకమైంది. నేతలు అరెస్టయి 30 రోజులు జైలులో ఉంటే ప్రధాని, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు 31 రోజున పదవి నుంచి తొలగించడం అనేది ఆ బిల్లు ఉద్దేశం.
ఈ బిల్లుపై చర్చ సందర్భంగా అధికార బీజేపీ-కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. చివరకు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష పార్టీల ప్రభుత్వాలను కట్టడి చేసేందుకు ఈ బిల్లు తెచ్చారన్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, సీఎం నితీష్ కుమార్ ల కోసమే ఈ బిల్లు తెచ్చారని ఆరోపించారు.
ALSO READ: ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు లోక్సభ ఆమోదం, అలా చేస్తే కోటి జరిమానా
బ్లాక్ మెయిల్ చేసేందుకు ఈ బిల్లు తెచ్చారని అన్నారు.దీనిపై బీజేపీ సభ్యులు ఎలాంటి కౌంటర్ ఇవ్వలేదు. ఈ వ్యవహారంపై ఇంటా బయటా జాతీయ పార్టీల మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. చివరకు విపక్ష సభ్యులు సైతం బిల్లును చింపేసి హోంమంత్రి అమిత్ షాపై విసిరారు కూడా. పరిస్థితి గమనించిన ఈ బిల్లు జేపీసీకి వెళ్లింది.
కాంగ్రెస్ చేసిన ఆరోపణల్లో నిజం ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ, జేడీయూ మద్దతు లేకుంటే మోదీ ప్రభుత్వం కుప్పకూలుతుందని అంటున్నారు. వారిని కట్టడి చేసేందుకు ఈ బిల్లు తెచ్చారని కాంగ్రెస్ నేతల వెర్షన్.
ఎందుకంటే.. టీడీపీ, జేడీయూ రెండు పార్టీలు గతంలో కాంగ్రెస్తో జతకట్టాయి. ఆ తర్వాత రాజకీయాల నేపథ్యంలో కాంగ్రెస్కు దూరమైన తర్వాత ఎన్డీయేకు మద్దతు పలికాయి. మొన్నటి ఎన్నికల్లో ఏపీలో కూటమి విజయం సాధించింది. బీహార్లో అలాంటి పరిస్థితి ఉందని అంటున్నారు. జరిగిన.. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ బిల్లు జేపీసీకి వెళ్లింది. పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లో జేపీసీ నివేదిక ఇవ్వనుంది.