Con Bride Gang | హర్యాణాలో సీమ, బిహార్ లో నేహ, ఉత్తర ప్రదేశ్ లో స్వీటీ, గుజరాత్ లో కాజల్. ఈ పేర్లు వింటే మీకేమనిపిస్తుంది. వీరంతా వేర్వేరు రాష్ట్రాలకు చెందిన యువతులు అనే భావన కలుగుతుంది. కానీ అది నిజం కాదు. ఈ పేర్లన్నీ ఒకే యువతికి చెందినవి. మరో విచిత్ర విషయమేమిటంటే ఆ యువతి వృత్తి.. వివాహాలు చేసుకోవడం. ఆ తరువాత ఆ వరుడిని, అతడి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోవడం. చాలా షాకింగ్ గా ఉంది కదా. విషయం ఇంతటితో ఆగి పోలేదు. ఆ యువతి తన లాంటి మరో ఆరు మంది యువతకుల గ్యాంగ్ నడుపుతోంది. ఈ గ్యాంగ్ ని తాజాగా పోలీసులు పట్టుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. 21 సంవత్సరాల గుల్షనా రియాజ్ ఖాన్ అనే యువతి ఉత్తర్ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఒక మాట్రిమోనీ ఫ్రాడ్ రాకెట్ నిర్వహిస్తోంది. ఈ గ్యాంగ్ లుటేరి దుల్హన్ పేరుతో అన్ని రాష్ట్రాల్లో ఫేమస్. ఇప్పటివరకు స్వయంగా గుల్షనా రియాజ్ ఖాన్ గత రెండు సంవత్సరాల్లోనే 12 మందిని వివాహం చేసుకుంది. కానీ పెళ్లి తరువాత కొన్ని గంటల్లోనే వరుడి కుటుంబానికి చెందని బంగారు నగలు, క్యాష్, ఇతర ఖరీదైన వస్తువులు తీసుకొని పారిపోయింది. ఇలా ప్రతి వివాహంలో చేస్తుంది. ఈమె ఆ గ్యాంగ్ కు లీడర్. ఆమె గ్యాంగ్ ఇలాంటి దొంగ పెళ్లికూతుర్లు అరడజనుకు పైగా ఉన్నారు.
ప్రతిసారి పెళ్లి తరువాత ఒకే విధంగా ప్లాన్ చేసి మోసాలు చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పెళ్లి తంతు పూర్తి అయిన తరువాత ఇక అందరూ బంధువులు ఇంటికి వెళ్లగానే పెళ్లికూతురు కూడా మాయమైపోతుంది. లేదా ఎవరైనా కిడ్నాప్ చేస్తారు. అసలు ఏం జరిగిందో తెలియక పెళ్లికొడుకు అమాయక చూపులు చూసుకుంటూ కూర్చుంటాడు. ఆ తరువాత ఈ దొంగ పెళ్లికూతురు ఆన్ లైన్ లో కొత్త పేరుతో కొత్త ప్రొఫైల్ తో కనిపిస్తుంది. మరో పెళ్లి కొడుకుని వేటాడుతుంది.
భర్త కూడా పార్ట్నర్
ఈ గ్యాంగ్ కు టైలర్ గ్యాంగ్ అని కూడా పేరు ఉంది. ఎందుకంటే గుల్షనా రియాజ్ ఖాన్ కు నిజంగానే ఒక భర్త ఉన్నాడు. అతడు ఉత్తర్ ప్రదేశ్ లోని జౌన్ పూర్ లో టైలర్ గా పనిచేస్తున్నాడు. రియాజ్ ఖాన్ టైలరింగ్ పనులు చేస్తూనే ఎవరైనా యువకులు పెళ్లి చేసుకునేందుకు యువతుల కోసం వెతుకుతుంటే వారి గురించి తెలుసుకొని వారిని మారుపేరుతో సంప్రదిస్తాడు. ఆ తరువాత తన భార్యకు ఆ యువకుడితో పెళ్లి చేయించేందుకు ప్రయత్నిస్తాడు. ఈ మొత్తం చేసినందుకు అతనికి దొంగతనం చేసిన సొమ్ములో 5 శాతం కమీషన్ ఉంటుంది.
Also Read: ఐపిఎల్ చూస్తూ ప్రమాదవశాత్తు తుపాకీ పేల్చిన బాలుడు.. పొరుగింటి వ్యక్తి మృతి
వారం రోజుల క్రితం పోలీసులు ఈ గ్యాంగ్ గురించి తెలుసుకొని యూపీలోని కసదహా గ్రామంలో సివిల్ డ్రెస్సులో వెళ్లి పట్టుకున్నారు. గుల్షనా రియాజ్ ఖాన్, మరో 8 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి ఒక మోటర్ సైకిల్, బంగారు చైన్, మంగళ సూత్రం, 11 మొబైల్ ఫోన్లు, మూడు నకిలీ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ గ్యాంగ్ లో పట్టుబడిన వారిలో అయిదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నట్లు వారంతా హర్యాణా, ఉత్తర్ ప్రదేశ్ లోని అంబేడ్కర్ నగర్, జౌన్ పూర్ కు చెందినవారని పోలీసులు తెలిపారు. వీరంతా ఒకరి పెళ్లిలో మరొకరు బంధువులుగా, కుటుంబ సభ్యులుగా వేషాలు వేస్తారని వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిలో మోహన్ లాల్ (34), రతన్ కుమార్ సరోజ్ (32), రంజన్ అలియాస్ అషు గౌతమ్ (22), రాహుల్ రాజ్ (30), సన్నో అలియాస్ సునీత (36), పూనమ్ (33), మంజు మాలి (29), రుక్సర్ (21) ఉన్నారు.
హర్యాణాలోని రోహ్తక్ నగరానికి చంెదిన సోను అనే యువకుడిని మార్చి నెలలో గుల్షనా ఖాన్ మారుపేరుతో పెళ్లిచేసుకొని రూ.80,000 నగదు, బంగారం దోచుకెళ్లిందని ఫిర్యాదు చేయడంల పోలీసులు విచారణ చేసి అందరినీ పట్టుకున్నారు. గుల్షనా ఇంటరాగేషన్ సమయంలో జరిగినదంతా చెప్పేసింది.