India Pak War| పాకిస్తాన్ మరోసారి వెన్నుపోటు పొడిచింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమించి భారత భూభాగంపై డ్రోన్లతో దాడులు చేసింది. జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్, బారాముల్లా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ డ్రోన్ల ద్వారా దాడులకు తెగబడింది. దీంతో శ్రీనగర్లోని ఆర్మీ చినార్ కోర్స్ హెడ్క్వార్టర్పై కూడా డ్రోన్ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో పంజాబ్లోని పలు జిల్లాల్లో బ్లాకౌట్ ప్రకటించేందుకు సైన్యం చర్యలు చేపట్టింది.
దీనికి తోడు.. జమ్మూ కశ్మీర్తో పాటు రాజస్తాన్, గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా అధికారులు బ్లాకౌట్ ప్రకటించారు. గుజరాత్లోని కచ్ ప్రాంతంలో పూరిస్థాయిలో బ్లాకౌట్ అమలైంది. డ్రోన్లు ఎక్కడ కనిపించినా వాటిని వెంటనే కూల్చేయాలని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)కు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలు కొనసాగితే.. పూర్తి స్థాయిలో ప్రతిస్పందించాల్సిందిగా సైనికులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. డ్రోన్ల కనబడితే కూల్చేయాలని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏవైనా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. పరిస్థితులను బట్టి రక్షణ బలగాలు ధీటుగా స్పందిస్తాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ హింసాత్మకంగా ఉల్లంఘించడంపై విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి తీవ్రంగా స్పందించారు. ఇరు దేశాల డిజిఎమ్ఓ (సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్)ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ సైన్యం పూర్తిగా విస్మరించిందని, ఇది తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనకు పూర్తిగా పాకిస్తాన్ బాధ్యత వహించాలని తెలిపారు. దీనిపై తగిన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని అన్నారు.
పాక్ చేసిన దాడులకు గట్టి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందని భారత ప్రభుత్వం భావిస్తోంది. భారత్ భూభాగంలోని సరిహద్దు పొడవునా పాక్ సైన్యం దాడులు చేసింది. ముఖ్యంగా LOC (లైన్ ఆఫ్ కంట్రోల్) దగ్గర పాక్ కాల్పులు జరిపిన విషయాన్ని భారత సైన్యం ధృవీకరించింది. అయితే భారత్ బలగాలు కూడా పాక్ కాల్పులకు ధీటుగా తిప్పికొడుతున్నాయి. పాక్ సైనికులు మరోసారి కాల్పులు జరపకుండా, తమ వైఖరిని మార్చుకోవాలని కేంద్రం హెచ్చరించింది. పరిస్థితులపై నిరంతరం సమీక్ష జరుపుతున్నట్టు విక్రమ్ మిస్రి తెలిపారు.
ఈ నేపథ్యంలో ఇండియా – పాకిస్తాన్ DGMOల మధ్య చర్చలు కూడా కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఉల్లంఘన నేపథ్యంలో మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరల్ స్థాయిలో చర్చలు జరగడం గమనార్హం.
Also Read: ఉగ్రవాదులను అంతం చేయాలంటే అదొక్కటే మార్గం.. ఇండియాకు గ్లోబల్ సెక్యురిటీ నిపుణుడి సూచన
మరోవైపు పాకిస్తాన్ సైన్యం దాడులు చేయడంపై కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. “సీజ్ఫైర్ ఇక లేనట్లే,” అంటూ ట్వీట్ చేశారు. పాకిస్తాన్ మళ్లీ బరితెగించి భారత్పై కాల్పులు చేసిందని.. శ్రీనగర్లోని పలు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నట్లు పేర్కొన్నారు. పాక్ కాల్పుల కారణంగా శ్రీనగర్లో బ్లాకౌట్ అమలు చేయాల్సి వచ్చిందన్నారు. ఒప్పందం కుదిరిన మూడు గంటల వ్యవధిలోనే పాక్ సైన్యం క్షిపణి దాడుల చేయడంపై ఆయన వ్యాఖ్యానించారు.
శ్రీనగర్లో నాలుగు ప్రాంతాల్లో కాల్పుల శబ్దాలు వినిపిస్తున్నట్లు సమాచారం. అఖ్నూర్, రాజౌరి, పూంచ్ సెక్టార్లలో పాక్ కాల్పులు జరపగా, భారత సైన్యం ధీటుగా ప్రతిస్పందిస్తూ వాటిని తిప్పికొట్టింది. రాజస్తాన్ సరిహద్దుల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో బ్లాకౌట్ అమలయ్యింది.
పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో బీఎస్ఎఫ్కు చెందిన ఎస్ఐ ఇంతియాజ్ వీరమరణం పొందారు. సరిహద్దు నగరాలపై మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్ను నిరోధించేందుకు బీఎస్ఎఫ్కు డ్రోన్లు కనిపించిన వెంటనే వాటిని కూల్చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.