Plane Crash Viral Video| అహ్మదాబాద్లో ఇటీవల జరిగిన విమాన ప్రమాదం వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ వీడియో రికార్డ్ చేసిన ఒక టీనేజర్ కుర్రాడిని పోలీసులు ఆ ఘటనకు సాక్షిగా స్టేట్మెంట్ తీసుకున్నారు. 17 ఏళ్ల బాలుడు ఆర్యన్, గురువారం జరిగిన ఎయిర్ ఇండియా AI 171 విమాన ప్రమాదాన్ని తన మొబైల్లో వీడియో తీశాడు. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. శనివారం.. ఆర్యన్ పోలీసులకు తన వాంగ్మూలం ఇచ్చాడని అధికారులు తెలిపారు.
ఈ భయానక ఘటన చూసి ఆర్యన్ తీవ్రంగా కలత చెందాడని అతని తండ్రి చెప్పాడు. ఘటన గురించి ఆర్యన మాట్లాడుతూ.. తన అద్దె ఇంటి సమీపంలో విమానాన్ని వీడియో తీస్తున్నానని, అది కొద్దిసేపట్లోనే పేలి పెద్దగా మంటలు రేగుతాయని ఊహించలేదని చెప్పాడు. ఈ వీడియో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయి.. ఈ విషాద సంఘటనను తక్షణం చూపించింది.
ఒక జాతీయ మీడియా చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఆర్యన్ తన స్నేహితులకు విమానం ఎలా ఎగురుతుందో చూపించాలనే ఉద్దేశంతో వీడియో తీసినట్లు తెలిపాడు. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆర్యన్ వాంగ్మూలం నమోదు చేశారు. మొదట, ఆర్యన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే తప్పుడు వార్తలు ప్రసారమయ్యాయి. కానీ పోలీసులు ఈ విషయంపై స్పందిస్తూ.. “ఈ వీడియో తీసినందుకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఒక మొబైల్ వీడియో స్క్రీన్ రికార్డింగ్ వైరల్ అయింది. వీడియో తీసిన బాలుడు తన తండ్రితో కలిసి సాక్షిగా వాంగ్మూలం ఇచ్చాడు. అతడిని తండ్రితో పాటు ఇంటికి పంపించేశాము. ఎటువంటి అరెస్టులు లేదా నిర్బంధాలు జరగలేదు” అని తెలిపారు.
ఆ భయానక క్షణాలను గుర్తుచేసుకుంటూ.. ఆర్యన్ ఆ వీడియో తీసిన 24 సెకన్లలోనే విమానం కూలిపోయిందని చెప్పాడు. “నాకు చాలా భయమేసింది. ఆ వీడియోని మొట్టమొదటగా మా అక్క చూసింది. నేను చూసి చాలా భయపడ్డాను” అని ఆర్యన్ ఆవేదన వ్యక్తం చేశాడు. అతని అక్క మాట్లాడుతూ, “ఆర్యన్ నాకు వీడియో చూపించి, ఇక్కడ ఉండడం ప్రమాదకరమని, ఇక్కడ ఉండాలని అనుకోవడం లేదని చెప్పాడు. అతను చాలా భయపడ్డాడు, సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు” అని తెలిపింది.
ఆర్యన్ నివసిస్తన్న ఇంటి యజమాని కూడా అతని బాధను గురించి మాట్లాడారు. “సంఘటన తర్వాత నేను వచ్చినప్పుడు ఆర్యన్ మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. నేను అతన్ని ఓదార్చాను. అతను రాత్రంతా నిద్రపోలేదు. నీరసంగా, నిశ్శబ్దంగా ఉంటూ ఏమీ తినలేదు” అని చెప్పారు.
Also Read: విమాన ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల తాత్కాలిక సాయం.. టాటా గ్రూప్ పరిహారానికి అదనం
గురువారం.. ఎయిర్ ఇండియా విమానం AI-171 అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్కు బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం గుజరాత్లోని బీజే మెడికల్ కాలేజీ మెస్ భవనాన్ని ఢీకొట్టి కిందపడింది. బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్లో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది సహా మొత్తం 242 మంది ఉన్నారు. వీరిలో 241 మంది మరణించారు. అయితే విమానంలో నుంచి విశ్వాస్కుమార్ రమేష్ అనే ఒక్క ప్రయాణికుడు మాత్రమే గాయాలతో బయటపడ్డాడు, ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు.