ఇంట గెలిచి రచ్చ గెలవాలని లేటుగానైనా తెలుసుకున్నాడు జనసేనాని పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎంకు సడెన్గా జ్ఞానోదయం అయినట్టుంది. తెలంగాణలో ఇటీవల పరిణామాలు బహుశా పవన్కు గుణపాఠాలు నేర్పించి ఉంటాయి. మొత్తానికి తత్వం బోధపడి ఉంటుంది. ఏపీలో తన పార్టీ బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా టైమ్ కేటాయించాడు.
ఎడ్ల బండి కింద నడుస్తూ పోతున్న కుక్క ఆ బండిని తానే లాగుతున్నానని అనుకుంటుందట. అట్లనే ఉంది పవన్ తీరు. ఏపీలో తన వల్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అనుకుంటున్నట్టున్నాడు బహుశా. కానీ అక్కడ టీడీపీ సపోర్టు, వైఎస్సార్ సీపీ వ్యతిరేక గాలి కలిసివచ్చింది. అదే ఒంటరిగా పోటీ చేసిన సమయంలో వచ్చిన ఫలితాలు కూడా ఆయన గమనంలోనే ఉన్నాయి.
కానీ అధికారం తెచ్చి పెట్టిన దర్పం.. వాస్తవాలను మరుగున పడేస్తుంది. భ్రమల్లో జీవింప చేస్తుంది. తమను మించిన ఘనుడు లేడచి ఛాతి విరుచుకు తిరిగేలా చేస్తుంది. అదే జరుగుతున్నదని పవన్ విషయంలో. అక్కడ అంతంత మాత్రంగానే ఉన్న పార్టీ నిర్మాణాన్ని వదిలేసి తెలంగాణపై పడ్డాడు. దీని వెనుక వ్యూహం ఉండి ఉంటుంది. కానీ వచ్చే విధానమే సరిగ్గా లేదు.
రేవంత్ నాకు దోస్తే అంటాడు. కేటీఆర్తో కూడ మంచి సంబంధాలున్నాయంటాడు. మరి ఎవరిపై యుద్దం చేస్తావు..? బీజేపీని అధికారంలోకి తేవాలి.. అదే కదా మోడీజీ ఉపదేశించిన సందేశం. మరి బీజేపీని గెలిపించాలంటే రేవంత్ను తిట్టాలి. సర్కార్ పాలనను నిలదీయాలి. ఫామ్హౌజ్ను టచ్ చేయాలి. పదేండ్ల పాపాలను ఓసారి జనానికి తెలియజేయాలి.
అవన్నీ చేయాలె కదా! అసలు జన సేనకు తెలంగాణలో ఉన్న బలం ఎంత.. ? పార్టీ సంస్థాగత నిర్మాణం ఎంత? జీరో. ఏపీలోనే అంతంత. మరి ఇక్కడ ఇసుమంత కూడా లేదు. అందుకే ముందు ఇళ్లు చక్కబెట్టుకోవాలనుకున్నట్టున్నాడు. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత ఉండనే ఉంది.
అందులోనూ అక్కడ సంస్థాగత ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. కనీసం అక్కడ ఉనికిని చాటుకోకపోతే.. పరువు పోతుందనే స్పృహలోకి వచ్చి ఉంటాడు. అందుకే ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా జన సేన పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాడు. ఇవాళ సమీక్ష నిర్వహించాడు. పార్లమెంట్ స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు పార్టీ బాధ్యతలతో పాటు వివిధ అనుబంధ విభాగాల్లో సేవలందించేందుకు ఆసక్తి ఉన్న సాధక్స్, నాయకులు, జనసైనికులందరికీ పార్టీలోకీలక భూమిక పోషించే అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. జనసేన శ్రేణులందరూ సద్వినియోగం చేసుకుని నాయకత్వ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చాడు.
ఇప్పటికే అక్కడ వైఎస్సార్ సీపీ పవన్ను టార్గెట్ చేస్తోంది. రాజకీయంగా ఏమి మాట్లాడినా దానికి పెడర్థాలు వెతుకుతూ పవన్ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. హోంమంత్రి వంగలపూడి అనితను కూడా వదల్లేదు చివరకు. ఆమెను కూడా మేకప్ మంత్రి అంటూ టీజింగ్ చేసే విధంగా కామెంట్లు చేయడమే కాదు.. దీన్ని సమర్థించుకున్నారు.
పవన్ దీనిపై మాట్లాడితే.. అతన్నీ టార్గెట్ చేస్తున్నారు. సాయికృష్ణ లాకప్ డెత్ ఇష్యూను ముందు పెడుతున్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని ఎండగడుతున్నారు. ఏపీ రాజకీయాల్లో ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ.. తెలంగాణతో ఎవరి సపోర్టు లేకుండా ఒంటరిగా పోరాటమంటే ఏటికి ఎదురీదడమే అవుతుందని పవన్కు తెలుసు. అందుకే ఏపీలో పరిస్థితులు కొంత చక్కిదిద్ది, జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు తెలంగాణ బరిలోకి దిగుదామనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది.